వీరమల్లు అప్‌డేట్.. ధర్మం కోసం యుద్ధం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ మొదలై దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇదేమో బల్క్ డేట్లు ఇవ్వాల్సిన భారీ చిత్రం.. పవన్ కళ్యాణ్‌కు వేరే కమిట్మెంట్లు చాలా ఉన్నాయి. వీటి మధ్య ఈ సినిమాను పూర్తి చేయడం కష్టమవుతోంది. అందుకే రిలీజ్ లేటవుతోంది. అభిమానులు కూడా విషయం అర్థం చేసుకుని ఈ సినిమా విషయంలో మౌనం వహిస్తున్నారు.

ఐతే సైలెంటుగా వాళ్ల పనిలో వాళ్లుంటే.. రెండు నెలల కిందట నిర్మాత ఏఎం రత్నం వారిని కదిలించాడు. ‘హరిహర వీరమల్లు’కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరిగిపోతున్నాయని.. అతి త్వరలో అభిమానుల కోసం మంచి ట్రీట్ ఇవ్వబోతున్నామని ప్రకటించాడు. కానీ తర్వాతి కొన్ని వారాల్లో చప్పుడు లేదు. శివరాత్రికి పక్కాగా ఏదో విశేషాన్ని పంచుకుంటారని అనుకుంటారనుకుంటే అలాంటిదేమీ జరగలేదు.

ఐతే ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా మళ్లీ ‘హరిహర వీరమల్లు’ టీం అభిమానులను ఊరించింది. శ్రీరామనవమి శుభకాంక్షలు చెబుతూ పవన్ కళ్లను మాత్రమే చూపిస్తున్న లుక్‌ రిలీజ్ చేసిన టీం.. దాంతో పాటు త్వరలోనే ఓ అప్‌డేట్ ఉంటుందని ప్రకటించింది. ‘ధర్మం కోసం యుద్ధం’ అనే టైటిల్‌తో ఆ అప్‌డేట్ రాబోతోందని ప్రకటించింది. శ్రీరాముడు ధర్మం కోసమే యుద్ధం చేసిన నేపథ్యంలో శ్రీరామ నవమి రోజు ఈ టైటిల్‌తో రాబోయే టీజర్‌ గురించి ఊరించింది.

ఐతే ఈసారైనా చెప్పిన మాటకు కట్టుబడి త్వరలో అప్‌డేట్ ఇస్తారా లేక.. ఎప్పట్లాగే అభిమానులను ఊరించి ఊరించి ఉస్సూరుమనిపిస్తారా అన్నది చూడాలి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ‘హరిహర వీరమల్లు’ ఈ ఏడాది పూర్తయి రిలీజయ్యే అవకాశం లేదు. వచ్చే ఏడాది వేసవికి వస్తే రావచ్చు.