కీరవాణి కూడా అందులో దిగిపోయాడు

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న సాంకేతిక విప్లవం. దీని సాయంతో ఎన్నెన్నో పనులు జరిగిపోతున్నాయి. మానవ వనరుల అవసరమే లేకుండా ఎన్నో అద్భుతాలు చేస్తోంది ఏఐ. సంగీత ప్రపంచంలో కూడా ఇది అనూహ్యమైన పనులు చేస్తోంది. చనిపోయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌తో పాటలు పాడించేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో తెలుగు పాటలు పాడిస్తోంది. సంగీత దర్శకులు కూాడా నెమ్మదిగా ఏఐ వినియోగానికి అలవాటు పడుతున్నారు.

టాలీవుడ్లో ఇప్పటికే రెండు పేరున్న చిత్రాల్లో ఏఐ వినియోగం జరిగింది. మలయాళ మ్యూజికల్ సెన్సేషన్ హేషమ్ అబ్దుల్.. ‘హాయ్ నాన్న’ సినిమా కోసం ఏఐని వినియోగించాడు. అంతకంటే ముందు తరుణ్ భాస్కర్ సినిమా ‘కీడా కోలా’ కోసం బాలు వాయిస్‌ను రీక్రియేట్ చేశారు. దీని మీద వివాదం కూడా నడిచింది.

కట్ చేస్తే ఇప్పుడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సైతం ఏఐని వినియోగించి పాట క్రియేట్ చేయడం విశేషం. తన సంగీత దర్శకత్వంలో వస్తున్న ‘లవ్ మి’ కోసం ఆయన ఈ ప్రయత్నం చేశారట. నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇందులో దయ్యం నేపథ్యంలో వచ్చే పాట కోసం ఏఐని ఉపయోగించారట. పూర్తి పాట ఏఐ సాయంతోనే రికార్డ్ చేశారట.

కీరవాణి లాంటి పాతతరం సంగీత దర్శకుడు ఇలా టెక్నాలజీ ఉపయోగించి పాట కంపోజ్ చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. దిల్ రాజు అన్న శిరీష్ తనయుడైన ఆశిష్ రెడ్డి ‘లవ్ మి’లో హీరో. అతడి తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు రూపొందించిన ఈ చిత్రంలో ఆశిష్ సరసన ‘బేబి’ ఫేమ్ వైష్ణవి చైతన్య నటించింది. ఈ నెల 25న ‘లవ్ మి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.