ఆగస్ట్ 15 పుష్పకి దారి ఇవ్వక తప్పదు

రకరకాల ఊహాగానాలు, ప్రచారాల మధ్య పుష్ప 2 ది రూల్ అసలు ఆగస్ట్ 15 విడుదల కాదనే అనుమానం ఇండస్ట్రీ వర్గాల్లోనే బోలెడు మందిలో ఉంది. ఒకవేళ వాయిదా పడితే మాత్రం బంగారం లాంటి ఆ డేట్ ని తీసుకునేందుకు పలు ప్యాన్ ఇండియా సినిమాలు కాచుకుని ఉన్నాయి. వాటికి ఎప్పటికప్పుడు మైత్రి మూవీ మేకర్స్ చెక్ పెడుతూ వచ్చినా సరే ఆగడం లేదు. ఫైనల్ గా ఇంకోసారి గట్టిగా చెప్పే సందర్భం వస్తోంది. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజుని పురస్కరించుకుని రిలీజ్ చేయబోతున్న స్పెషల్ టీజర్ ద్వారా సదరు సందేశాన్ని బలంగా వినిపించబోతున్నారు.

సో పుష్ప 2 వస్తుందా రాదానే అనుమానాలకు పూర్తిగా చెక్ పడినట్టే. గంగమ్మ వేషంలో బన్నీ చాలా టెర్రఫిక్ గా నటించిన విజువల్స్ తోనే కొత్త టీజర్ ని సెట్ చేశారని సమాచారం. ఊహించని మేకోవర్ తో పాటు విజువల్స్ చూసి ఫ్యాన్సే కాదు మూవీ లవర్స్ సైతం షాక్ కి గురవ్వడం ఖాయమని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ షూటింగ్ కీలక దశలో బిజీగా ఉన్నారు. జూలై రెండో వారం లోపు సెన్సార్ కాపీ సిద్ధం చేసే లక్ష్యంగా రేయి పగలు వర్క్ చేస్తున్నారు. ఇంకో నాలుగున్నర నెలలే సమయం ఉంది కాబట్టి ఈ మాత్రం ఉరుకులు పరుగులు తప్పవు.

టీజర్ తర్వాత బిజినెస్ ఊపందుకోబోతోంది. ఇప్పటిదాకా ఎంత డిమాండ్ ఉన్నా సరే చాలా ఏరియాలు అమ్మలేదు. మొత్తం కలిపి కనీసం వెయ్యి కోట్ల వ్యాపారం చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అది నిజం కావాలంటే ప్రమోషనల్ కంటెంట్ ఓ రేంజ్ లో ఉండాలి. దానికి తగ్గట్టే వదలబోతున్నారట. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్, ధనుంజయ్, జగదీష్, రావు రమేష్ తో పాటు అదనంగా కొత్త తారాగణం ఎక్కువే ఉందని అంటున్నారు. ఆగస్ట్ 15 బాలీవుడ్ మల్టీస్టారర్ సింగం అగైన్ పోటీకి సై అంటోంది. చివరి నిమిషంలో రిస్క్ ఎందుకులెమ్మని తప్పుకున్నా ఆశ్చర్యం లేదు.