మ్యాడ్ మ్యాక్స్ మరో బంగారు బాతు

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమాల కన్నా మీడియం బడ్జెట్ లో తీసే మూవీస్ తోనే సితార సంస్థకు లాభాల పంట పండుతోంది. ఇమేజ్, మార్కెట్ వల్ల మొదటి క్యాటగిరీలో సేఫ్ అవ్వొచ్చు కానీ రిస్క్ తక్కువగా ఉన్నవి వర్కౌట్ అయితే మాత్రం లాభాలు ఊహకందని స్థాయిలో ఉంటాయి. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ ఒకదాన్ని మించి మరొకటి ఏ స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించాయో కలెక్షన్ల సాక్షిగా చూస్తున్నాం. ఊహించిన దాని కన్నా చాలా ఎక్కువగా ఓపెనింగ్స్ నమోదు కావడం నిర్మాతల కన్నా ఎక్కువగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లలో ఆనందం నింపుతోంది.

ఇదే తరహాలో గత ఏడాది అక్టోబర్ లో విడుదలైన మ్యాడ్ సితార, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థకు భారీ లాభాలు తీసుకొచ్చింది. నిర్మాతగా సోదరి పేరు వేసినా సమర్పకుడిగా మొత్తం దగ్గరుండి చూసుకున్నది నాగవంశీనే. ఇప్పుడు దీని సీక్వెల్ ‘మ్యాడ్ మ్యాక్స్’గా రాబోతోంది. మొదటి భాగాన్ని సూపర్ హిట్ చేసిన కళ్యాణ్ శంకరే దీనికీ దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడు. స్క్రిప్ట్ మొత్తం ఫైనలయ్యిందట. మ్యాడ్ లో ఇంజనీరింగ్ చదివిన ముగ్గురు కుర్రాళ్లు చదువు పూర్తి చేసుకున్న మూడేళ్ళ తర్వాత బయట ప్రపంచంలో ఎదురుకోబోయే సమస్యల్ని, ఉద్యోగ పర్వాన్ని చాలా వినోదాత్మకంగా రాసుకున్నారట.

ఇది మరో బంగారు బాతు అవుతుందని ఇన్ సైడ్ టాక్. కారణం లేకపోలేదు. టిల్లు స్క్వేర్ ఒకదశ దాటాక సెకండ్ హాఫ్ విషయంలో సిద్దు జొన్నలగడ్డ, మల్లిక్ రామ్ కు మల్లగుల్లాలు పడుతుంటే కళ్యాణ్ శంకర్ ఎంట్రీ ఇచ్చాకే సరైన ఎపిసోడ్లు, మరిన్ని మంచి డైలాగులు పడ్డాయని తెలిసింది. అలాంటిది తన డైరెక్షన్ లో సినిమా కోసం ఇంకెంత హిలేరియస్ గా రాసుకుంటాడో వేరే చెప్పనక్కర్లేదు. క్యాస్టింగ్ ని మార్చకుండా మొత్తం అదే తారాగణంతో మ్యాడ్ మాక్స్ ని రూపొందిస్తారట. టిల్లు తరహాలో ఇందులో ఊహించని ట్విస్టులు, థ్రిల్స్ చాలానే పెడతారని వినికిడి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.