మూడు డిజాస్ట‌ర్ల త‌ర్వాత రెండు హిట్లు

ఏడాది వెనక్కి వెళ్తే టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు పరిస్థితి చలా ఇబ్బందికరంగా ఉండేది. వరుసగా మూడు పెద్ద డిజాస్టర్లు ఖాతాలో వేసుకున్నాడతను. అర్జున, ఫాల్గుణ, భళా తందనాన, అల్లూరి సినిమాలు పూర్తిగా వాషౌట్ అయిపోయి శ్రీ విష్ణు మార్కెట్‌ను దారుణంగా దెబ్బ తీసినట్లే కనిపించాయి. ఆ దశ నుంచి అతనెలా కోలుకుంటాడో అనుకున్నారందరూ. కానీ గత ఏడాది ‘సామజవరగమన’ అతడికి గొప్ప ఉపశమనాన్నందించింది.

ఈ సినిమా అంచనాలను మించిపోయి పెద్ద హిట్టయింది. శ్రీవిష్ణు ఒక మోస్తరు విజయం కోసం చూస్తున్న టైంలో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. సక్సెస్ మత్తులో ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేయకుండా కొంచెం జాగ్రత్తగానే అడుగులు వేశాడు శ్రీవిష్ణు. దాని ఫలితమేంటో తర్వాతి సినిమాతోనే తెలిసింది.

శ్రీ విష్ణు కొత్త చిత్రం ‘ఓం భీం బుష్’ గత వీకెండ్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి బజ్‌తో రిలీజైన ఈ సినిమాకు కొంచెం డివైడ్ టాక్ వచ్చింది. ఐపీఎల్ ప్రభావం వల్ల తొలి రోజు వసూళ్లు కూడా అంచనాల మేర రాలేదు. కానీ రెండో రోజు సినిమా పుంజుకుంది. వరుసగా మూడు రోజులు తొలి రోజును మించి వసూళ్లు రావడం విశేషం. సోమవారం హోళీ కావడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. నాలుగు రోజుల్లో ‘ఓం భీం బుష్’ రూ.20 కోట్ల మేర వసూళ్లు రాబట్టి హిట్ దిశగా అడుగులు వేస్తోంది.

దాదాపుగా అన్ని ఏరియాల్లో బయ్యర్లు బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లే. ఫుల్ రన్ అయ్యేసరికి ‘ఓం భీం బుష్’ సూపర్ హిట్ రేంజిని అందుకునే అవకాశముంది. మొత్తానికి మూడు వరుస డిజాస్టర్ల తర్వాత ఒక సూపర్ హిట్, ఓ హిట్ పడడంతో శ్రీ విష్ణు కెరీర్ మరింత ఊపందుకోనుంది. అతను త్వరలో ‘స్వాగ్’ మూవీతో పలకరించనున్నాడు. దాని తర్వాత గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో ఓ సినిమా చేయాల్సి ఉంది.