రామాయణం అంతులేని బ్రేకుల కథ

ఇంకా మొదలుపెట్టకుండానే ప్రేక్షకుల్లో, మీడియాలో హాట్ టాపిక్ గా మారిన బాలీవుడ్ రామాయణం ఇప్పట్లో తెమిలేలా లేదు. వచ్చే నెల శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభోత్సవం ఉంటుందనే ప్రచారానికి బ్రేక్ వేస్తూ అసలు ఈ ఏడాది షూటింగ్ జరగడం అనుమానమేనని లేటెస్ట్ అప్డేట్. దానికి చాలా కారణాలున్నాయట. మొదటిది క్యాస్టింగ్ వ్యవహారం. రాముడిగా రన్బీర్ కపూర్ తప్ప మిగిలిన పేర్లన్నీ గాసిప్స్ రూపంలో వచ్చినవే. సీతగా సాయిపల్లవి ఒప్పుకుందని అంటున్నారు కానీ మీడియా ఎక్కడైనా కలిసినప్పుడు ఆమె దీని ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతోంది.

మూడు భాగాలు ప్లాన్ చేసుకోవడంతో ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పడుతోంది. పైగా ఆర్టిస్టుల కాల్ షీట్స్ ఎంత అవసరం అవుతాయనే దాని మీద దర్శకుడు నితీష్ తివారి బృందం కసరత్తు చేస్తూనే ఉంది. ఒకవేళ లాంఛనంగా వచ్చే నెల అయోధ్యలో ఓపెనింగ్ చేయాలన్నా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏ పార్టీ వారిని ఆహ్వానించలేరు. ప్రధాని మోడీ సమక్షంలో ఈ కార్యక్రమం చేయాలని నిర్మాతల ఆలోచన. ఇప్పుడది సాధ్యం కాదు. అసలు ట్విస్టు ఏంటంటే రావణాసురుడిగా యష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనేది బెంగళూరు టాక్. తను టాక్సిక్ తో చాలా బిజీగా ఉన్నాడు.

ఇవన్నీ చూస్తుంటే ఈ రామాయణంని కొంత కాలం మర్చిపోవడం బెటర్. ఇప్పటికే విజయ్ సేతుపతి తప్పుకున్నాడు. సన్నీ డియోల్ ప్రాధమికంగా ఓకే చెప్పాడు కానీ ఇంకా అగ్రిమెంట్ అవ్వలేదు. రకుల్ ప్రీత్ సింగ్ తో సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి సైతం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట. పురిట్లోనే ఇన్ని బ్రేకులు పడుతున్న రామాయణంని నభూతో నభవిష్యత్ రేంజ్ లో తెరకెక్కించాలని నితీష్ తివారి ఆలోచన. యానిమల్ తర్వాత రన్బీర్ కపూర్ కమిట్ మెంట్స్ వేరే ఉన్నాయి. బ్రహ్మస్త్ర 2తో పాటు యానిమల్ పార్క్ కు సంబంధించిన డిస్కషన్లు జరుగుతున్నాయి.