ఈగల్ దర్శకుడి మల్టీస్టారర్ కు మరమ్మత్తులు

ఫిబ్రవరిలో విడుదలైన రవితేజ ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి అది షూటింగ్ లో ఉండగానే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇంకో సినిమా ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని చిత్రీకరణ గత ఏడాది నవంబర్ లోపే కొంత భాగం చేశారు. మిరాయ్ టైటిల్ ప్రచారంలో ఉంది కానీ ఇంకా అఫీషియల్ కాలేదు. తేజ సజ్జ, దుల్కర్ సల్మాన్ హీరోలుగా మంచు మనోజ్ విలన్ గా చాలా క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాసుకున్నారని అప్పట్లో టాక్ తిరిగింది అయితే హనుమాన్ తర్వాత లెక్కలు మారిపోయాయట. తేజ సజ్జకు మార్కెట్ వచ్చింది. హిందీతో కలిపి ప్యాన్ ఇండియా హక్కులకు డిమాండ్ పెరిగింది.

దీంతో అతను నెక్స్ట్ చేయబోయే మూవీస్ కి సంబంధించి పునఃసమీక్ష చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే మిరాయ్ కు కొన్ని రిపేర్లు చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. తేజకు లెన్త్ పెంచి దానికి అనుగుణంగా ఏమేం మార్పులు చేయాలో వాటన్నింటి మీద వర్క్ జరుగుతోందట. అందుకే షూట్ కి కొంత బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఏప్రిల్ లేదా మే నుంచి కొనసాగించేలా ప్రణాళిక వేసుకున్నారని తెలిసింది. దీంతో పాటు బాలకృష్ణ 109లో నటిస్తున్న దుల్కర్ సల్మాన్ రెండింటికి సమాంతరంగా కాల్ షీట్స్ ఇచ్చి వేసవిలోగా వాటి పనిని పూర్తి చేసుకునే ప్లానింగ్ లో ఉన్నాడు.

ఒకవేళ ఈగల్ కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ దాని ఫలితం కార్తీక్ ఘట్టమనేనిని అలెర్ట్ చేసింది. కేవలం యాక్షన్, ఎలివేషన్లతో పని జరగదని, సరైన ఎమోషన్ లేకుండా వీటితో ప్రేక్షకులను మెప్పించలేమని అర్థం చేసుకున్నాడు. అందుకే మిరాయ్ లో అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త పడే టైం వచ్చింది. ఇక తేజ సజ్జ వీలైనంత కమర్షియల్ మూస జోలికి వెళ్లకుండా ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. జై హనుమాన్ లో ఫుల్ లెన్త్ ఉంటుందో లేదో అనే అనుమానాల నేపథ్యంలో తన దగ్గరికొస్తున్న కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.