బ్రేక్ ఇచ్చిన దర్శకుడికి ‘నో’ చెప్పిన వేళ..

టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ కెరీర్లో అతి పెద్ద మలుపు అంటే.. ‘జయం’ మూవీనే. లెజెండరీ డైరెక్టర్ టి.కృష్ణ తనయుడైన గోపీచంద్ ‘తొలి వలపు’ అనే సినిమాతో హీరోగా పరిచయం కాగా.. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో తన కెరీర్ డోలాయమానంలో పడింది. ఆ స్థితిలో ‘జయం’ మూవీతో గోపీని విలన్‌గా పరిచయం చేశాడు తేజ. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయి గోపీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నిజం, వర్షం లాంటి చిత్రాల్లో విలన్‌గా మరింత మెప్పించిన గోపీ.. ‘యజ్ఞం’ సినిమాతో హీరోగా రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూసుకోలేదు.

ఇలా తన కెరీర్‌ను మలుపు తిప్పిన తేజ.. తర్వాత ఓ సినిమాలో హీరోగా నటించమంటే నో అన్నాడట గోపీచంద్. ఐతే అది ధిక్కరింపు కాదని.. తనకు సూటవ్వని సినిమా కాబట్టే దానికి నో చెప్పానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు గోపీచంద్.

“తేజ గారు ‘నిజం’ తర్వాత కొన్నేళ్లకు ఓ కథ చెప్పారు. అందులో హీరో పాత్రే ఇచ్చారు. కానీ అది లేడీ ఓరియెంటెడ్ టచ్ ఉన్న సినిమా. నాకు సూట్ కాదనిపించింది. నా పక్కన ఓ కొత్తమ్మాయిని నటింపజేయాలనుకున్నారు. అది మరింత రిస్క్. ఎవరైనా పేరున్న హీరోయిన్ అయితే బాగుంటుందన్నా. మొత్తంగా నా అయిష్టతను ఆయనకు తెలియజేశా. తేజ గారు నా అభిప్రాయంతో ఏకీభవించారు. కొన్నిసార్లు మొహమాటాలకు పోయి చేసిన సినిమాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అందుకే నేను పూర్తిగా సంతృప్తి చెందిన సినిమాలే చేయాలనుకున్నా” అని గోపీచంద్ తెలిపాడు.

ఇక తన కెరీర్లో ఎంతో నచ్చి చేసిన సినిమాల్లో కొన్ని సరిగా ఆడకపోవడం బాధ పెట్టిందంటూ.. ‘ఒక్కడున్నాడు’, ‘సాహసం’ చిత్రాలను ఉదాహరణగా చెప్పాడు గోపీచంద్. ‘ఒక్కడున్నాడు’ను ఇప్పుడు రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అవుతుందని చెప్పాడు. కొన్ని లోపాలున్నప్పటికీ ‘గౌతమ్ నంద’ కూడా పెద్ద హిట్టవ్వాల్సిన సినిమాగా పేర్కొన్నాడు.