ఇంద్రగంటి.. ఏదో అనుకుంటే

తెలుగులో మంచి అభిరుచితో సినిమాలు తీసే దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. గ్రహణం లాంటి అవార్డు సినిమాతో మొదలుపెట్టి అష్టాచెమ్మా, అమీతుమీ, జెంటిల్‌మన్, సమ్మోహన లాంటి చిత్రాలతో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఐతే చాలా వరకు లో, మీడియం బడ్జెట్ సినిమాలే తీస్తున్న ఇంద్రగంటికి స్టార్లతో పెద్ద సినిమా తీయాలని ఉంది. కానీ ఆ ఆశ తీరట్లేదు. చివరగా ఆయన్నుంచి వచ్చిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నిరాశపరచగా.. దాని ఫలితంతో సంబంధం లేకుండా ఓ భారీ చిత్రం చేయడానికి ఇంద్రగంటి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

‘జటాయు’ పేరుతో దిల్ రాజు బేనర్లో ఇంద్రగంటి భారీ చిత్రం చేస్తున్నట్లు చర్చ జరిగింది. దిల్ రాజు సైతం ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరి ఆ బిగ్ బడ్జెట్ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తుంటే.. ఇంద్రగంటి మళ్లీ పాత స్టయిల్లో సినిమాను అనౌన్స్ చేశాడు.

కమెడియన్ టర్న్డ్ హీరో ప్రియదర్శి హీరోగా మళ్లీ ఓ చిన్న బడ్జెట్ మూవీనే చేయబోతున్నాడు ఇంద్రగంటి. ఆయనతో ‘జెంటిల్‌మన్’ సినిమాను నిర్మించిన సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. మార్చిలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్ రూప కొడయూర్ ఈ చిత్రంలో ప్రియదర్శికి జోడీగా నటించబోతోంది.

‘బలగం’ సినిమా తర్వాత ప్రియదర్శికి హీరోగా మంచి డిమాండే ఏర్పడింది. త్వరలోనే అతను ‘ఓం భీం బుష్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. హీరోగా ఇంకా రెండు మూడు చిత్రాలు రాబోతున్నాయి ప్రియదర్శి నుంచి. ఈ లోపు ఇంద్రగంటి లాంటి అభిరుచి ఉన్న దర్శకుడితో అతడి సినిమా ఖరారైంది. అతడి వైపు నుంచి ఇది మంచి ప్రాజెక్టే కానీ.. ఇంద్రగంటి నుంచి ఓ పెద్ద సినిమా ఆశించిన వాళ్లు మాత్రం నిరాశ చెందుతున్నారు.