అక్కినేని వారి వల్ల కానిది దగ్గుబాటి వారు చేస్తారా?

టాలీవుడ్లో అక్కినేని, దగ్గుబాటి వారివి బడా ఫ్యామిలీలు. ఈ రెండు కుటుంబాలకు ఘనమైన సినీ వారసత్వం ఉంది. వాళ్లకు స్టూడియోలున్నాయి. అందులో 24 క్రాఫ్ట్స్‌లో అనుభవం, అవగాహన ఉన్న బోలెడంత మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లున్నారు. వివిధ సినీ పరిశ్రమలతో ఈ రెండు కుటుంబాలకు మంచి సంబంధాలున్నాయి.

ఈ నేపథ్యంలో తమ వనరులను, అనుభవాన్ని సద్వినియోగం చేసేందుకు గాను ఈ రెండు ఫ్యామిలీస్ వేర్వేరుగా ఫిలిం స్కూల్స్ ఏర్పాటు చేశాయి. చాలా ఏళ్ల నుంచి సినిమాకు సంబంధించి అనేక కోర్సులు అందిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిపుణుల్ని తీసుకొచ్చి శిక్షణార్థులకు క్లాసులు ఇప్పిస్తున్నాయి. తమ స్టూడియో వనరులనూ ఉపయోగించుకుంటున్నాయి. ఐతే జాతీయ స్థాయి ఈ రెండు ఫిలిం స్కూళ్లకూ మంచి పేరుంది. కానీ వీటి నుంచి ఆశించిన స్థాయిలో టెక్నీషియన్స్ బయటికి రావట్లేదు.

అక్కినేని వారి స్కూల్ నుంచి ఇంతకుముందు కొందరు టెక్నీషియన్స్, ఆర్టిస్టులు బయటికి వచ్చి సొంతంగా సినిమా తీసే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వచ్చిన ఓ లేడీ డైరెక్టర్ తీసిన ‘పడేశావె’ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేదు. అందరూ ఆ స్కూల్ స్టూడెంట్సే కలిసి తీసిన ఓ చిన్న సినిమా విడుదలకు కూడా నోచుకోకుండా ఆగిపోయింది. ఇంతకుమించి అన్నపూర్ణ వారి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ల ఊసులేవీ ఇండస్ట్రీలో వినిపించలేదు.

ఇప్పుడు దగ్గుబాటి వారి కాంపౌండ్ నుంచి వచ్చిన ఇద్దరు విద్యార్థులకు సురేష్ ప్రొడక్షన్స్‌లోనే దర్శకులుగా అవకాశాలు లభించాయి. అందులో ఒకరు సీనియర్ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు కొడుకు అశ్విన్ గంగరాజు. అతను ఇప్పటికే ‘ఆకాశవాణి’ అనే సినిమా తీశాడు. ఇది విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోపే సురేష్ ప్రొడక్షన్స్‌లో ఓ మర్డర్ మిస్టరీ తీసే అవకాశం వచ్చింది. అతడితో పాటు సతీష్ త్రిపుర అనే మరో కొత్త దర్శకుడితోనూ సురేష్ బాబు ఓ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈ ఇద్దరు యువ దర్శకులు దగ్గుబాటి వారి పేరు నిలబెట్టే సినిమాలు తీస్తారేమో చూడాలి.