పాపం గౌతమ్ మీనన్

గౌతమ్ మీనన్.. మణిరత్నం తర్వాత తమిళంలో అంతటి గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్. కాక్క కాక్క, వేట్టయాడు విలయాడు, ఎన్నై అరిందాల్ లాంటి యాక్షన్ సినిమాలను ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేశాడో.. చెలి, ఏమాయ చేసావె, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి ప్రేమకథలను అంత హృద్యంగా తీసి తన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడతను.

ఐతే దర్శకుడిగా సినిమాలు తీసుకోవడానికి పరిమితం అయితే బాగానే ఉండేది. కానీ నిర్మాతగా మారి ఫాంటాన్ ఫిలిమ్స్ అనే సంస్థను పెట్టి పెద్ద తప్పు చేశాడు. కొన్ని సినిమాలకు సంబంధించిన ఫినాన్షియల్ ఇష్యూస్ ఆయన కెరీర్ మీద తీవ్ర ప్రభావం చూపాయి. ఒక దశలో ఆయన సినిమాలన్నీ డోలాయమానంలో పడిపోయాయి. వాటిలో ఒక్కోదాన్ని బయటికి తీసుకురాగలిగాడు కానీ.. ‘ధృవనక్షత్రం’, ‘నరకాసురన్’ అనే రెండు చిత్రాలు మాత్రం ఎటూ కాకుండా పోయాయి.

ఇందులో విక్రమ్ హీరోగా నటించిన ‘ధృవనక్షత్రం’ను ఎలాగైనా రిలీజ్ చేయాలని కొన్ని నెలలుగా గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు గౌతమ్. కానీ డేట్ ప్రకటించాక మళ్లీ మళ్లీ వాయిదా వేయడం అనివార్యం అవుతోంది. చివరగా నవంబరు 24న సినిమాను రిలీజ్ చేయడానికి గౌతమ్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత తాను డైరెక్ట్ చేయాల్సిన సినిమాలను పక్కన పెట్టి ఈ చిత్రానికి మోక్షం కల్పించడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు గౌతమ్. కానీ ఫలితం లేదు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆవేదనతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు గౌతమ్. అది చూసి అయ్యో అనుకుంటున్నారు గౌతమ్‌ అభిమానులు.

“ఇది హార్ట్ బ్రేకింగ్‌గా అనిపిస్తోంది. సినిమా వాయిదా విషయంలో ఎన్నో రోజులుగా మనశ్శాంతి లేదు. నా కుటుంబం ఆందోళన చెందుతోంది. నా భార్య నెల రోజులుగా ఈ విషయమే ఆలోచిస్తోంది. నాకు ఎటైనా వెళ్లిపోవాలనిపిస్తోంది. కానీ ఇన్వెస్టర్లకు సమాధానం చెప్పాలి కాబట్టి ఉంటున్నా. మార్చి 1న నా సినిమా ‘జాషువా’ విడుదల కానుంది. ఆలోపే ‘ధృవనక్షత్రం’ను రిలీజ్ చేయాలని చూశాను. కానీ కుదరలేదు” అని ఆవేదన స్వరంతో చెప్పాడు గౌతమ్. ఇలాంటి గ్రేట్ డైరెక్టర్‌కు అలాంటి పరిస్థితి రావడం సినీ ప్రేమికులకు ఆవేదన కలిగిస్తోంది.