పాతబస్తీలో రామ్ నందన్ IAS మాస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ కీలక షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. వచ్చే నెలాఖరుకు మొత్తం పూర్తి చేయాలన్న సంకల్పంతో టీమ్ ఉంది. ఇదిలా ఉండగా సెట్ నుంచి అందుతున్న లీకులని బట్టి చూస్తే ఎలివేషన్లు ఓ రేంజ్ లో ఉంటాయని తెలిసింది. ఒక శాంపిల్ చూద్దాం. ఐఎఎస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ ఒక రాజకీయ కారణం మీద పాత బస్తీకి రావాల్సి ఉంటుందట. అయితే విలన్ పన్నిన వ్యూహం వల్ల రోడ్డు మార్గంలో ఎవరికీ ఎంట్రీ లేకుండా వందలాది గుండాలు చుట్టూ కాపలాగా ఉంటారు. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి.

దీంతో ఏకంగా హెలికాఫ్టర్ వేసుకుని బస్తీ నడిమధ్యలో కలెక్టర్ రామనందన్ గా ఎంట్రీ ఇచ్చే ఎపిసోడ్ ఓ రేంజ్ లో తీశారట శంకర్. ఇది సినిమా మొత్తం హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సీన్ కోసం భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులను వాడారు. చరణ్ బెస్ట్ ఇంట్రోస్ లో ఒకటిగా ఇది నిలుస్తుందని లైవ్ లో చూసిన వాళ్ళ టాక్. ఒకే ఒక్కడులో అర్జున్ క్యారెక్టర్ ని పది రెట్లు పెంచితే ఎలా ఉంటుందో దానికి మించి ఇది మాస్ కి గూస్ బంప్స్ ఇస్తుందని వినికిడి. ఇంతకన్నా ఫ్యాన్స్ కి కావాల్సింది ఏముంటుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఈ సీన్ గురించి బోలెడు చెబుతున్నారు.

విడుదల తేదీ ప్రకటన కోసం అభిమానులు ఇంకా ఎదురు చూడక తప్పేలా లేదు. ఆగస్ట్ నుంచి అక్టోబర్ దాకా స్లాట్స్ దాదాపు ఖాళీగా లేవు. అందుకే డిసెంబర్ వైపు వెళ్లాలని చూస్తున్నట్టు తెలిసింది. ధృవ, సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, మాస్, మన్మథుడు లాంటివి ఈ నెలలోనే వచ్చి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి కాబట్టి నిర్మాత దిల్ రాజు ఈ ఆప్షన్ కూడా చూస్తున్నారట. క్లారిటీ రావాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. తమన్ స్వరపరిచిన పాటల్లో జరగండి జరగండిని ఉగాది పండగ సందర్భంగా రిలీజ్ చేసి ఆ రోజు నుంచే ప్రమోషన్లకు శ్రీకారం చుట్టే ప్లాన్ లో ఉంది ఎస్విసి బృందం.