ఆడవారి మాటలకు జోడి మళ్ళీ ఇంకోసారి

విక్టరీ వెంకటేష్, త్రిష కాంబినేషన్ లో మొదట వచ్చిన సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. 2007లో రిలీజైన ఈ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అప్పట్లో ఘన విజయం సాధించింది. తన శైలికి భిన్నంగా దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన తీరు తమిళం కంటే తెలుగులోనే పెద్ద హిట్టు అందుకునేలా చేసింది. వెంకీ త్రిష జంటని ఆడియన్స్ ఫ్రెష్ గా ఫీలవ్వడమే కాక పాటల్లో బాగా ఎంజాయ్ చేశారు. తిరిగి 20009లో నమో వెంకటేశా చేశారు కానీ అది ఎబోవ్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. 2012లో బాడీ గార్డ్ భారీ అంచనాలు అందుకోలేక ఫెయిలయ్యింది

కట్ చేస్తే ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఈ జంట కలిసే అవకాశమున్నట్టు ఫిలిం నగర్ టాక్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే విలేజ్ డ్రామాలో త్రిషనే తీసుకునే ఆలోచన సీరియస్ గా జరుగుతోందట. కాకపోతే ఆమె డేట్స్ దొరకడం అంత సులభంగా లేదట. ఆల్రెడీ చిరంజీవి విశ్వంభరకు బల్క్ కాల్ షీట్స్ ఇచ్చింది. ఇంకోవైపు కమల్ హాసన్ తగ్స్ లైఫ్, అజిత్ మూవీలను పూర్తి చేయాల్సి ఉంది. మోహన్ లాల్ రామ్, టోవినో థామస్ ఐడెంటిటీ పెండింగ్ ఉన్నాయి. వేసవిలోగా వీటిలో అధిక శాతం అయిపోతాయట. సో వెంకీ మూవీ ఒప్పుకునే ఛాన్స్ ఉంది.

ఒకవేళ ఓకే అయితే వెంకటేష్ అనిల్ రావిపూడిలకు పెద్ద సమస్య తీరినట్టే. ఎందుకంటే ఈ మధ్య సీనియర్ హీరోలకు హీరోయిన్ల సెట్ చేయడం దర్శకులకు సవాల్ గా మారిపోయింది. పొన్నియిన్ సెల్వన్, లియోలో త్రిషని చూశాక అరే ఇన్నేళ్లు ఎలా మిస్ అయ్యామని ఫీలైన వాళ్లే ఎక్కువ. అందుకే అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవలే మన్సూర్ అలీ ఖాన్ తో పాటు ఒక రాజకీయ పార్టీ నేత చేసిన అనవసర వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడిన త్రిష ఈసారి మౌనంగా ఉండకుండా సదరు పొలిటికల్ లీడర్ మీద పరువు నష్టం దావా వేసి ఆ నోటీస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వార్నింగ్ ఇచ్చింది.