రీమేక్ చేసే పద్దతి ఇలా ఉండాలి

మాములుగా పక్క భాషలో హిట్ అయిన సినిమాను రీమేక్ చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రెండు కీలకాంశాలు గుర్తు పెట్టుకోవాలి. మొదటిది ఒరిజినల్ వెర్షన్ ఏ ఓటిటిలో అందుబాటులో లేకుండా చూసుకోవడం. మరొకటి స్టార్ క్యాస్టింగ్ ని ఎంచుకోవడం. ఆ మధ్య చిరంజీవి గాడ్ ఫాదర్ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అమెజాన్ ప్రైమ్ లో లూసిఫర్ తెలుగు డబ్బింగ్ అందుబాటులో ఉన్నా పట్టించుకోలేదు. ఫలితంగా లక్షలాది మందికి కథేంటో తెలిసిపోయింది. భీమ్లా నాయక్ మూలం అయ్యప్పనుం కోశియుమ్ ని సబ్ టైటిల్స్ తో చూసినవాళ్లు లక్షల్లో ఉన్నారు.

ఇలాంటి పొరపాట్లు సైతాన్ టీమ్ చేయలేదు. వచ్చే మార్చ్ 8న విడుదల కాబోతున్న ఈ హారర్ థ్రిల్లర్ లో అజయ్ దేవగన్, జ్యోతిక జంటగా నటిస్తుండగా మాధవన్ విలన్ రోల్ చేశాడు. ఇవాళ ట్రైలర్ వచ్చింది. ఇది గుజరాతి సూపర్ హిట్ వష్ కి అఫీషియల్ రీమేక్. హిందీలో చేయాలని ఫిక్స్ అవ్వగానే వష్ ని ఓటిటిలో రాకుండా జాగ్రత్త పడ్డారు. ఫలితంగా నెటిజెన్లు ఎంత వెతికినా ఈ సినిమా దొరకలేదు. గుజరాతిలో బ్లాక్ బస్టర్ సాధించిన ఇలాంటి మూవీ అందుబాటులో లేకపోవడం అనూహ్యం. కేవలం నాలుగు ప్రధాన పాత్రలతో సాగే హారర్ కం సస్పెన్స్ థ్రిల్లర్ ఇది.

వర్షం పడే రోజు ఒక ఆగంతకుడికి ఆశ్రయం ఇస్తారు భార్యాభర్తలు. ఫోన్ ఛార్జింగ్ కోసం వచ్చిన అతడు వాళ్ళ కూతురిని వశీకరణ విద్య ద్వారా వశపరుచుకొని ఆ కుటుంబాన్ని ప్రమాదంలో నెట్టేస్తాడు. కళ్ళముందే ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వెళ్తున్న కన్నబిడ్డను కాపాడుకోవడం కోసం ఆ తండ్రి చేసే యుద్ధమే సైతాన్. మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా మాధవన్ పెర్ఫార్మన్స్ అవుట్ స్టాండింగ్ అనిపించేలా ఉంది. థియేటర్ల దగ్గర చేతబడి ముగ్గులు వేయించి మాంత్రికులను పెట్టి టీమ్ వెరైటీగా ప్రమోషన్లు చేస్తోంది. ఇలాంటి ప్లానింగే హైప్ పెంచేది.