శివ శివ…ఇంకెన్నిసార్లు ఊరిస్తారు

టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్స్ లో ఒకటిగా నిలిచిన శివ గురించి దశాబ్దాలు గడుస్తున్నా ఫిలిం మేకర్స్ ఆ మాస్టర్ పీస్ నుంచి నేర్చుకుంటూనే ఉంటారు. రామ్ గోపాల్ వర్మ అనే సంచలనాన్ని నాగార్జున పరిచయం చేసిన తీరు ఎప్పటికీ మర్చిపోలేని సాహసం. 1989లో రిలీజైన ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ ని రీ రిలీజ్ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కొన్నేళ్ల క్రితం జరిగిన పాతికేళ్ల యానివర్సరి వేడుకలో త్వరలోనే చేస్తామని హీరో కం నిర్మాత నాగార్జున ప్రకటించారు కానీ సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. మరోసారి దాని ప్రస్తావన తెరపైకి వచ్చింది.

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న వ్యూహం ప్రమోషన్ల సందర్భంగా తనను అడిగిన మీడియాతో మాట్లాడిన వర్మ శివ 4కె పనులు పూర్తయ్యాయని, ఎప్పుడు థియేటర్లలో వదలాలన్నది అన్నపూర్ణ స్టూడియోస్ నిర్ణయమని చెప్పుకొచ్చారు. అయితే దగ్గరలో ఆ సూచనలేమి కనిపించడం లేదు. గత రెండేళ్లుగా రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇదే బ్యానర్ నుంచి వచ్చిన మన్మథుడుని జనాలు బ్రహ్మాండంగా ఆదరించారు. అయితే శివ కేసు వేరు. ఇప్పటి పాతిక ముప్పై ఏళ్ళ కుర్రాళ్ళకు శివ థియేటర్ ఎక్స్ పీరియన్స్ తెలియదు. టీవీ, ఫోన్, ఓటిటిలో తప్ప చూసి ఎరుగరు.

అలాంటిది పెద్ద తెరపై చూపిస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. రఘువరన్ విలనీ, ఇళయరాజా పాటలు, మతి పోగొట్టే రీ రికార్డింగ్, అవార్డు సాధించిన గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం, జెడి చక్రవర్తి లాంటి టాలెంట్స్ ని పరిచయం చేసిన వైనం ఒకటా రెండా శివ కబుర్ల గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. నాగార్జున, అమల బంధం మరింత బలపడింది కూడా ఈ సెట్లోనే. అయితే ఒరిజినల్ నెగటివ్ లో కొంత భాగం మరమత్తులో ఉందని ఇప్పట్లో అవ్వకపోవచ్చని మరో టాక్ ఉంది. ఏదైతేనేం వీలైనంత త్వరగా బిగ్ స్క్రీన్ మీద శివని చూపిస్తే ఆ కిక్కే వేరని ఎవరైనా ఒప్పుకుంటారు.