కేసుల సుడిగుండంలో వివాదాస్పద సినిమాలు

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ రాజకీయాలను ఆధారంగా చేసుకుని తీసిన సినిమాలు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. ఇవాళ విడుదలైన ‘రాజధాని ఫైల్స్’ని ఆపాలని వైసిపి నాయకుడు వేసిన కేసుకు స్పందించిన హై కోర్టు తదుపరి తీర్పు ఇచ్చే వరకు షోలు రద్దు చేయాలని స్టే ఆర్డర్ ఇవ్వడంతో ఆఘమేఘాల మీద విజయవాడ, ఒంగోలు తదితర ప్రాంతాల్లో స్క్రీనింగ్ జరుగుతుండగానే అధికారులు ప్రవేశించి ప్రేక్షకులను వెనక్కు పంపించారు. న్యాయస్థానం ఆదేశాలను చూపించమని కొందరు డిమాండ్ చేసినా వినకపోవడం గమనార్హం.

ఇంకోవైపు హైదరాబాద్ తో సహా తెలంగాణలో రాజధాని ఫైల్స్ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. మార్నింగ్ షోలు నిర్విఘ్నంగా పూర్తయ్యాయి. మరి కోర్టు ఆర్డర్లు ఈ రాష్ట్రానికి వర్తించవా లేదా అనేదాని గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మూడు రాజధానుల అంశంతో పాటు అధికార పార్టీని అవమానించేలా సినిమా తీశారని పిటీషనర్ ప్రధాన ఆరోపణ. వచ్చే వారం 23 విడుదల కాబోతున్న రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ ఇదే తరహా కాంట్రావర్సిని ఎదుర్కుంటోంది. డిసెంబర్ లోనే రావాల్సిన ఈ సినిమా నారా లోకేష్ లేవనెత్తిన అభ్యంతరం వల్ల వాయిదా పడుతూ చివరికి మోక్షం దక్కించుకుంది.

వ్యూహం, శపథం రెండింటిలోనూ వర్మ ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్షాలను దారుణంగా అవమానించే రీతిలో సన్నివేశాలు పెట్టారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నా ప్రస్తుతానికి అడ్డుకట్ట తొలగింది కానీ ఈ వారంలో ఇంకేదైనా మలుపు జరుగుతుందేమో చూడాలి. ‘యాత్ర 2’కి ఈ సమస్య రాలేదు. ఆడియన్స్ కూడా తిరస్కరించడంతో కంటెంట్ అంతగా హైలైట్ కాలేకపోయింది. నిజాం పాలనలో జరిగిన అరాచకాల బ్యాక్ డ్రాప్ లో రూపొంది మార్చి 1 రిలీజవుతున్న ‘రజాకార్’ మీద కూడా పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దానికి సెగలు తప్పకపోవచ్చని టాక్.