బాలీవుడ్ చంద్రముఖి తెలివైన నిర్ణయం

గత ఏడాది వచ్చిన అత్యంత చెత్త టాప్ ఫైవ్ సినిమాల్లో ఉండే కళాఖండం చంద్రముఖి 3. లారెన్స్ హీరోగా కంగనా రౌనత్ టైటిల్ రోల్ పోషించగా తెలుగు తమిళంలో మొదట ఈ మాస్టర్ పీస్ ని పరిచయం చేసిన పి వాసునే దర్శకత్వం వహించారు. తిరిగి అదే కథను రోత పుట్టించే కథనంతో, చూసిన సన్నివేశాలనే మళ్ళీ చూపిస్తూ పెట్టిన టార్చర్ మామూలుది కాదు. సోషల్ మీడియాలోనూ విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా ఒరిజినల్ వెర్షన్లలో నటించిన సౌందర్య, శోభన, జ్యోతికలను మరిపించేలా కంగనా ఏ మాత్రం చేయలేకపోవడం సమూలంగా దెబ్బ కొట్టింది.

బాలీవుడ్ లో భూల్ భులయ్యాతో మొదలైన ఈ సిరీస్ ఫస్ట్ పార్ట్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించగా విద్యా బాలన్ అదిరిపోయే నటనతో శభాష్ అనిపించుకుంది. మొన్నటి ఏడాది రెండో భాగంలో టబుకి కీలక పాత్ర ఇచ్చి కార్తీక్ ఆర్యన్ తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ఇతగాడితోనే మూడో భూల్ భులయ్యాకు తెరతీశారు. షూటింగ్ కూడా మొదలైపోయింది. ఈసారి తెలివిగా విద్యా బాలన్ నే మళ్ళీ వెనక్కు తీసుకొచ్చి కొత్త కథ చెప్పబోతున్నారు. సీక్వెల్స్ లో ఎక్కడా పి వాసు ఛాయలు లేకుండా ఒరిజినల్ కథలు రాసుకోవడంతో ఆడియన్స్ బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు.

ఇదే పని వాసు కూడా చేసి ఉంటే నాగవల్లి, చంద్రముఖి 3 లాంటి డిజాస్టర్లు వచ్చేవి కాదు. దీపావళికే భూల్ భూలయ్యా 3 రిలీజ్ కాబోతుంది. ఒక హారర్ జానర్ లో ఇన్ని భాగాలు హిట్ కావడం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. ఇంత సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత విద్య బాలన్ చంద్రముఖిగా ఎలా మెప్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కూడా జ్యోతికనే తీసుకుని ఉంటే బాగుండేది. కానీ కంగనా చేతికి వెళ్ళింది. కార్తీక్ ఆర్యన్ కు జోడిగా కియారా అద్వానీనే కొనసాగుతుందో లేదో ఇంకా వెల్లడి కాలేదు. అయినా హీరోని మార్చినా సీక్వెల్స్ విజయం సాధించడం విచిత్రమే.