డబ్బింగ్ సినిమాలకు టైం బాలేదు గురూ

ఒకప్పుడు తెలుగులో తమిళం నుంచి వచ్చిన అనువాదం సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. రజనీకాంత్, సూర్య, కార్తీ, విక్రమ్ వీళ్లంతా మన మార్కెట్ ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడంతా రివర్స్ లో జరుగుతోంది.కోలీవుడ్ లో కాస్తో కూస్తో బాగా ఆడినవి కూడా ఇక్కడ రిలీజ్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. శివ కార్తికేయన్ కి ఇక్కడ డీసెంట్ ఫాలోయింగ్ ఉన్నా ‘ఆయలాన్’ ఏవో ఆర్థిక లావాదేవీల వల్ల ఇక్కడికి రాకుండానే సన్ నెక్స్ట్ ఓటిటిలో నిన్నటి నుంచే వచ్చింది. ఒక్కవేళ ఇబ్బందులు తొలగించుకుని థియేటర్లలో అడుగు పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదు.

మోహన్ లాల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ‘మలైకోట్టై వాలిబన్’ మలయాళంలోనే ఘోరంగా డిజాస్టర్ కావడంతో ఇక్కడ హక్కులు కొన్న వాళ్ళు చేతులు ఎత్తేశారు. కట్ చేస్తే మార్చి 1 నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ జరగొచ్చని టాక్ ఉంది. తాజాగా వచ్చిన ‘లాల్ సలామ్’లో రజనీకాంత్ చెప్పుకోదగ్గ నిడివితో పాత్ర చేసినా మొదటి రోజే జీరో షేర్లు నమోదు చేసి అభిమానులను బయ్యర్లను భయపెట్టింది. తమిళనాడులో రికార్డులు సృష్టించిన ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాలు ఇక్కడ చావు తప్పి కన్నులొట్ట పోయిన రీతిలో బొటా బోటిగా బ్రేక్ ఈవెన్ దాటుకుని హమ్మయ్య అనిపించుకున్నాయి. జపాన్, మార్క్ ఆంటోనీ, జిగర్ తండ డబుల్ ఎక్స్, సప్తసాగరాలు దాటి, చంద్రముఖి 2, చిన్నా వగైరాలన్నీ చాప చుట్టేసినవే.

ఒక ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే జైలర్, యానిమల్ మాత్రమే తెలుగులో బ్లాక్ బస్టర్ స్టేటస్ సాధించాయి. ‘కెప్టెన్ మిల్లర్’ సోదిలో లేకుండా పోయింది. లియో పర్వాలేదనిపించుకున్నా విక్రమ్ స్థాయిలో యునానిమస్ గా పాజిటివ్ అనిపించుకోని మాట వాస్తవం. తాజాగా వచ్చిన ‘ట్రూ లవర్’ కి సైతం డివైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఒరిజినల్ వెర్షన్ మీద ఎంత భారీ అంచనాలున్నా సరే డబ్బింగులు మాత్రం బిజినెస్ కోసం ఎదురీదాల్సి వచ్చేలా ఉంది. ఒకరకంగా ఇది మంచిదేనని చెప్పాలి. అన్ని ఎగబడి కొనకుండా మన ప్రొడ్యూసర్లు జాగ్రత్త పడతారు.