హనుమాన్ పరుగులు పూర్తవుతున్నాయి

సంక్రాంతికి చిన్న అంచనాలతో వచ్చి తొంబై రెండేళ్ల సినీ చరిత్రలో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న హనుమాన్ దాదాపుగా శాంతించాడు. మూడు వందల కోట్ల గ్రాస్ వరకు దూకుడుగానే ఉన్నా నాలుగు వారాలు దాటబోతున్న తరుణంలో బాగా స్లో అయ్యాడు. ఒకరకంగా చెప్పాలంటే ఫైనల్ రన్ కి దగ్గరగా ఉన్నట్టే. ప్రధాన కేంద్రాల్లో వీకెండ్ ఆక్యుపెన్సీలు బాగానే నమోదవుతుండగా మాములు రోజుల్లో పలు చోట్ల డెఫిషిట్లు మొదలైపోయాయి. కాకపోతే అప్పటిదాకా వసూలైన గ్రాస్ కోణంలో చూసుకుంటే ఏ కోశానా పైసా నష్టం వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు.

థియేట్రికల్ రన్ బాగుందని ఓటిటి రిలీజ్ ని మార్చికి వాయిదా వేసిన జీ5 మళ్ళీ నిర్ణయం ఏమైనా మార్చుకుంటుందేమో చూడాలి. ఈ వారం మొత్తం నాలుగు కొత్త సినిమాలు వస్తున్నాయి. ఈగల్, యాత్ర 2, లాల్ సలామ్, ట్రూ లవర్ లు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. గుంటూరు కారం, సైంధవ్ లు ఓటిటిలో వచ్చేశాయి. ఫిబ్రవరి 15 నా సామిరంగ స్ట్రీమింగ్ కాబోతున్నట్టు టాక్. కెప్టెన్ మిల్లర్, ఆయలాన్ కూడా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ దాదాపుగా థియేటర్లలో తీసేశారు. మిగిలింది హనుమాన్ ఒక్కటే. ఇంకో వారం పది రోజుల కంటే ఎక్కువ కొనసాగలేకపోవచ్చు.

లెక్కల సంగతి ఎలా ఉన్నా బాక్సాఫీస్ మీద బలమైన ముద్ర వేయడంతో హనుమాన్ సక్సెస్ సాధించాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ, హీరోయిన్ అమృత అయ్యర్, నిర్మాత నిరంజన్ రెడ్డిలు అమెరికాలోనే ఉంటూ ప్రమోషన్లు ఆపకుండా చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడొచ్చే కొత్త రిలీజుల్లో ఏమైనా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే దాని ప్రభావం ఉంటుంది. లేదూ అంటే శని ఆదివారాలు హనుమాన్ కి ఇంకో ఛాన్స్ దొరికినట్టే. నాలుగు వందల కోట్ల గ్రాస్ అందుకుంటుందేమోననే అంచనా నిజమయ్యే అవకాశం లేదు . ట్రిపుల్ సెంచరీతోనే పరుగు ఆపాల్సి వచ్చేలా ఉంది.