రాంబాబు థియేటర్లలో పొలిటికల్ సెగలు

ఇవాళ పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబుని రీ రిలీజ్ చేశారు. కొంచెం గ్యాప్ తర్వాత స్క్రీన్ మీద పవర్ స్టార్ దర్శనం కావడంతో అభిమానులు భారీగా స్పెషల్ షోలకు వెళ్లారు. ముఖ్యంగా ఉదయం వేసిన ఆటలకు మంచి స్పందన దక్కింది. అయితే తెలంగాణ థియేటర్లలో కొన్ని నెలల నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబందించిన యాడ్స్ వేస్తున్న సంగతి తెలిసిందే. పక్క రాష్ట్రంలో కోట్లు ఖర్చు పెట్టి ఎందుకీ ప్రచారం అంటే ఏపీలో ఓటు హక్కు ఉన్న వాళ్ళ కోసమని ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడీ పబ్లిసిటీనే రాంబాబు హాళ్లల్లో సెగలు పుట్టించింది.

ఏం జరిగిందంటే సినిమా ప్రారంభానికి ముందు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాల యాడ్ మొదలైంది. దాంట్లో జగన్ మాట్లాడుతున్న వీడియో కూడా ఉంటుంది. ఇంకేముంది జనసేన సైనికులు ప్లస్ పవన్ అభిమానులకు కోపం వచ్చేసింది. ప్రొజెక్టర్ కు చేతులు అడ్డుపెట్టి ఒకరు, స్క్రీన్ పైకి వస్తువులు చెప్పులు విసిరి మరొకరు ఇలా రకరకాల రూపాల్లో నిరసన వ్యక్తం చేయడంతో అప్రమత్తమైన ఆపరేటర్ వెంటనే వాటిని ఆపేసి నేరుగా నెక్స్ట్ కంటెంట్ కి వెళ్లిపోవడం గమనార్హం. పలు చోట్ల ఇలాంటి సీన్లే కనిపించాయి. పవన్ సినిమాలో జగన్ బొమ్మ చూపిస్తే ఇంతేగా.

కెమెరామెన్ గంగతో రాంబాబులో పొలిటికల్ సెటైర్లు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి కొడుకులుగా నటించిన ప్రకాష్ రాజ్ – కోట శ్రీనివాసరావు మధ్య సీన్లు బాగా పేలాయి. అయితే కొన్ని కీలకమైన ఒకటిరెండు సన్నివేశాలు కత్తెరకు గురి కావడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. సెలబ్రేషన్స్ అయితే బాగానే చేసుకున్నారు. యాత్ర 2 రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో దానికి కౌంటర్ గానే రాంబాబుని రీ రిలీజ్ చేశామని, ప్రతి టికెట్ మీద పది రూపాయలు జనసేనకు విరాళంగా వెళ్తుందని డిస్ట్రిబ్యూటర్ ప్రకటించడం తెలిసిన విషయమే. ఈ స్పందనకు అదీ ఒక కారణం.