పడుతూ లేస్తూ సాగుతున్న ‘బ్యాండు’

గత వారాంతంలో రెండంకెల సంఖ్యలో కొత్త సినిమాలు వచ్చాయి తెలుగులో. కానీ వాటిలో చాలా సినిమాల పేర్లు కూడా జనాలకు పరిచయం లేదు. వీటిలో చాలా సినిమాలు నామమాత్రంగానే రిలీజయ్యాయి. కనీస స్థాయిలో కూడా ప్రేక్షకుల దృష్టిని అవి ఆకర్షించలేదు. ఈ చిన్న సినిమాల వరదలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది ఒక్క ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మాత్రమే.

ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో సుహాస్ హీరోగా కొత్త దర్శకుడు దుష్యంత్ కటికనేని రూపొందించిన ఈ చిత్రానికి గీతా ఆర్ట్స్-2 అధినేత బన్నీ వాసు, వెంకటేష్ మహాల బ్యాకప్ లభించింది. గీతా ఆర్ట్స్ పేరు పోస్టర్ మీదికి రావడంతోనే ఈ సినిమాకు ఒక బజ్ వచ్చింది. రిలీజ్ ముంగిట పబ్లిసిటీ కూడా బాగా చేశారు. పెయిడ్ ప్రిమియర్స్ కూడా ప్లస్ అయ్యాయి.

ఐతే సినిమాకు పూర్తి పాజిటివ్ టాక్ అయితే రాలేదు. సినిమా పర్వాలేదు అనే టాక్ స్ప్రెడ్ అయింది. దీంతో పెయిడ్ ప్రిమియర్స్ తర్వాత తొలి రోజు కలెక్షన్లు కొంచెం అటు ఇటుగా వచ్చాయి. దీంతో సినిమా నిలడడుతుందా లేదా అన్న సందేహాలు కలిగాయి. కానీ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ పడుతూ లేస్తూ బాగానే నెట్టుకొస్తోంది. వసూళ్లు మరీ గొప్పగా లేవు. అలా అని తీసిపడేసేలా లేవు. వీకెండ్లో వరల్డ్ వైడ్ షేర్ రూ.5 కోట్లకు చేరువగా వచ్చింది. ఈ సినిమా రేంజికి ఇది పెద్ద నంబరే.

సినిమా సూపర్ అనిపించకపోయినా.. తీసిపడేసేలా లేకపోవడం, పోటీలో ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేకపోవడం దీనికి ప్లస్ అయింది. ఈ వారం ‘ఈగల్’ వస్తోంది కాబట్టి ‘అంబాజీపేట..’ సెకండ్ వీకెండ్ మీద పెద్దగా ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు. ఆ లోపు ఎంత వీలైతే అంత రాబట్టుకోవడమే. అంతిమంగా ఈ సినిమా రేంజికి వస్తున్న వసూళ్లు చూస్తే ఇది సక్సెస్ ఫుల్ సినిమాగా నిలబడుతున్నట్లే.