ఆఫర్ల వర్షంలో తడిసిపోతున్న త్రిష

హీరోయిన్ గా రెండు దశాబ్దాల కెరీర్ పూర్తి చేసుకుంటున్న త్రిష ఆ మధ్య కొంత గ్యాప్ వచ్చి ముక్కుమొహం తెలియని సినిమాలు కొన్ని చేసింది కానీ ‘పొన్నియిన్ సెల్వన్’ తర్వాత ఒక్కసారిగా గ్రాఫ్ అమాంతం పెరిగిపోతోంది. సీనియర్ స్టార్ హీరోలు మూకుమ్మడిగా తననే కోరుకోవడంతో దర్శక నిర్మాతలకు ఆమె కాల్ షీట్లు దొరకడం కష్టమైపోయింది. ‘లియో’లో విజయ్ సరసన పిల్లల తల్లిగా నటించినా సరే నువ్వే కావాలని వెంటపడుతున్నారు. తెలుగులో చిరంజీవి సరసన ‘విశ్వంభర’కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. అధికారికంగా ఆమె సెట్లలో అడుగు పెట్టేటప్పుడు ప్రకటించబోతున్నారు.

తాజాగా సల్మాన్ ఖాన్ తో పంజా దర్శకుడు విష్ణువర్ధన్ రూపొందించబోయే ‘ది బుల్’లో త్రిషనే తీసుకున్నట్టు ముంబై టాక్. ముందు సమంతా అన్నారు కానీ తర్వాత ఎందుకనో మరి సౌండ్ లేదు. ప్రస్తుతం ఈ వర్షం బ్యూటీ అజిత్ తో ‘విదా ముయార్చి’ చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో క్రేజీ కాంబోగా పేరు పడిన మోహన్ లాల్ – జీతూ జోసెఫ్ ‘రామ్’లో కూడా త్రిషనే మెయిన్ లీడ్. కమల్ హాసన్ – మణిరత్నం కాంబోలో ‘థగ్ లైఫ్’లోనూ ఛాన్స్ కొట్టేసింది. ‘ఐడెంటిటీ’ అనే మరో మూవీ నిర్మాణంలో ఉంది. పాతిక వయసులో ఉన్న కుర్ర హీరోయిన్లు కూడా ఇంత బిజీగా లేరు.

ఈ లెక్కన ఇంకో రెండేళ్ల దాకా త్రిష ఎవరికీ దొరికేలా లేదు. ఇంకా బ్యాచిలర్ లైఫ్ నే ఎంజాయ్ చేస్తున్న క్రమం పెళ్ళెప్పుడు అంటే మాత్రం దాటేస్తోంది. లేట్ ఇన్నింగ్స్ లోనూ ఇంత బ్రహ్మాండమైన డిమాండ్ నయనతార తర్వాత త్రిష మాత్రమే ఎంజాయ్ చేస్తోంది. ఇంకో రెండు మూడు ఆఫర్లు ప్రతిపాదన దశలో ఉన్నాయి కానీ డేట్ సమస్య వల్ల ఒప్పుకోలేకపోతోందట. నాలుగు పదుల వయసులోనూ కట్టిపడేసే అందంతో మేజిక్ చేస్తుంటే హీరో వేరే ఆప్షన్లు ఎందుకు చూస్తారు. విశ్వంభర సెట్లో ఈ నెలాఖరు నుంచి పాల్గొనవచ్చని యూనిట్ టాక్. స్టాలిన్ తర్వాత చిరుతో చేస్తున్న సినిమా ఇదే.