పాతికేళ్ల తర్వాత ఆ జోడీ మళ్లీ?

సినిమా కమర్షియల్‌గా అనుకున్నంతగా ఆడి ఉండకపోవచ్చు. కానీ ‘ప్రియురాలు పిలిచింది’ సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు ఒక మరపురాని జ్ఞాపకం. అందమైన ఆర్టిస్టులు.. దానికి తోడు అద్భుతమైన పెర్ఫామెన్స్.. క్లాసిక్ సాంగ్స్.. హృద్యమైన సన్నివేశాలతో ఆ సినిమా అప్పటి యువ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. అందులో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న జోడీ అజిత్-టబులదే. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు, పాటలు ఇప్పుడు చూసినా మంచి ఫీల్ కలుగుతుంది.

ముఖ్యంగా ‘లేదని చెప్ప నిమిషము చాలు’ పాట అయితే ఎవర్ గ్రీన్. ఆ సినిమాతో అంతగా అలరించిన ఈ జోడీ మళ్లీ ఎప్పుడూ కలిసి సినిమా చేయలేదు. ఐతే పాతికేళ్ల తర్వాత ఈ జంటను తెరపై చూడబోతున్నామన్నది కోలీవుడ్ తాజా సమాచారం. యువ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ఈ కాంబినేషన్లో సినిమా చేయబోతున్నాడు.

అజిత్‌కు వీరాభిమాని అయిన ఆధిక్.. గత ఏడాది విశాల్‌తో ‘మార్క్ ఆంటోనీ’ అనే సూపర్ హిట్ ఇచ్చాడు. ఆ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. ‘మార్క్ ఆంటోనీ’ సక్సెస్ తన అభిమాన హీరోతో సినిమా చేసే అవకాశం కల్పించింది. అజిత్‌కు కథ చెప్పడం.. సినిమాకు ఓకే చెప్పడం ఆల్రెడీ జరిగిపోయాయి. కొన్నేళ్లుగా అజిత్ నడి వయస్కుడి పాత్రలే చేస్తున్నాడు. అందుకే తగ్గట్లే హీరోయిన్లనూ ఎంచుకుంటున్నాడు. ఆయన చివరి సినిమా ‘తునివు’లో కూడా మలయాళ సీనియర్ హీరోయిన్ మంజు వారియర్ కథానాయికగా చేసింది.

ప్రస్తుతం అజిత్ నటిస్తున్న ‘విడా ముయర్చి’లో కూడా త్రిష హీరోయిన్. దీని తర్వాత ఆధిక్ దర్శకత్వంలో చేసే సినిమాలో టబుతో జోడీ కట్టబోతున్నాడట అజిత్. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్ర చేయనుండగా.. ఎస్.జె.సూర్య ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ రాబోతోంది.