ఆ జ్యోతిష్యుడికి గట్టిగా ఇచ్చిన ప్రభాస్ పెద్దమ్మ

వేణు స్వామి అని ఒక జ్యోతిష్యుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్. చాలా కాన్ఫిడెంట్ గా అందరి జాతకాల గురించి స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటాడు ఈయన. తెలంగాణ ఎన్నికల్లో మళ్లీ టిఆర్ఎస్ గెలుస్తుందని.. వన్డే ప్రపంచకప్ లో ఇండియన్ టీందే విజయం అని చెప్పిన పెద్దమనిషి ఈయనే. గతంలో ఆయన అంచనా వేసిన విషయాల్లో కొన్ని నిజమైన మాట వాస్తవం. కానీ అంతకుమించి ఫెయిల్ అయ్యాయి. ఇది పట్టించుకోకుండా వేణు స్వామి చెప్పిన విషయాలను బట్టి ప్రభావితం అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు.

ఆ మధ్య ఈ వేణు స్వామి హీరో ప్రభాస్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ జీవితంలో బాహుబలితోనే మహర్దశ అయిపోయిందని.. ఇంకెప్పటికీ ఆయన పెద్ద హిట్ కొట్టలేడని.. అలాగే ప్రభాస్ కు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేసాడు వేణు స్వామి. ఈ విషయమై ప్రభాస్ అభిమానులు కొంత కంగారు పడ్డారు. కట్ చేస్తే సలార్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ప్రభాస్ చాలా ఆరోగ్యంగానే కనిపిస్తున్నాడు.

వేణు స్వామి వ్యాఖ్యలు ప్రభాస్ కుటుంబ సభ్యులను కూడా బాధించిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి వేణు స్వామి జ్యోతిష్యం గురించి మాట్లాడింది. ప్రభాస్ ఆరోగ్యం, కెరీర్ గురించి అతను చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పు పట్టారు. ఈ కామెంట్ల గురించి కొందరు తన దృష్టికి తెచ్చారని.. తనతో పాటు కుటుంబ సభ్యులు కొంచెం బాధ కలిగిందని ఆమె చెప్పారు.

అయితే ప్రభాస్ జాతకం వాళ్ళ అమ్మగారికి మాత్రమే తెలుసని, తనకు కూడా తెలియదని.. అలాంటప్పుడు వేణు స్వామి ఎలా మాట్లాడతాడని ఆమె ప్రశ్నించారు. ఇలాంటివి పట్టించుకోవద్దని అభిమానులకు ఆమె విన్నవించారు. ప్రభాస్ విషయంలో అంతా బాగుందని ఆమె అన్నారు.