పెద్దాయన మూవీని ప్రేక్షకులు పట్టించుకోలేదు

బయోపిక్స్ రొటీన్ గా మారుతున్న ట్రెండ్ లో మాజీ ప్రధాని, బిజెపి పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అటల్ బిహారి వాజ్ పేయ్ గారి కథ తెరకెక్కడం మొన్న రిలీజైపోవడం జరిగాయి. మిర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి టైటిల్ రోల్ పోషించగా మరాఠిలో చాలా పేరున్న రవి జాదవ్ దర్శకత్వం వహించారు. దేశంలో అధిక రాష్ట్రాల్లో కేంద్ర అధికార పార్టీ హవా నడుస్తున్న ట్రెండ్ లో ఈ సినిమాకు మంచి స్పందన వస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. అయితే పబ్లిక్ దీని మీద ఏమంత ఆసక్తి చూపించడం లేదని వసూళ్లు తేటతెల్లం చేస్తున్నాయి. రెస్పాన్స్ చాలా వీక్ గా ఉంది.

వాజ్ పాయ్ జీవితాన్ని మొత్తం రెండున్నర గంటల్లో చూపించే ప్రయత్నం చేసిన రవి జాదవ్ ముఖ్యమైన ఘట్టాలన్నీ కవర్ చేశారు. కార్గిల్ యుద్ధం, పోక్రాన్ ప్రయోగాలు, గవర్నమెంట్ మైనారిటీలో పడే ప్రమాదం ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, అద్వానీతో స్నేహం, ప్రతిపక్షాలను తెలివిగా ఎదురుకున్న తీరు అన్నీ ఉన్నాయి. అయితే తగినంత డ్రామా లేకుండా కేవలం సంఘటనలు చూపించడానికి స్క్రీన్ ప్లే వాడుకోవడంతో సినిమాటిక్ ఫ్లేవర్ తగ్గిపోయి డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పంకజ్ త్రిపాఠి ఎంత అద్భుతంగా నటించినా కంటెంట్ బాగా తడబడింది.

దేశమంతా రామాలయ ప్రారంభం హడావిడిలో ఉండటం మై హూ అటల్ వెనుకబడేందుకు మరో కారణం అయ్యింది. నిర్మాతలు మాత్రం ఎంతో ఆశించారు కానీ దానికి తగ్గ ఫలితమైతే వచ్చేలా లేదు. అయినా సాక్ష్యాత్తు ప్రస్తుత ప్రధాని మీద వివేక్ ఒబెరాయ్ లాంటి ఆర్టిస్టుని పెట్టి బయోపిక్ తీస్తేనే జనాలు లైట్ తీసుకున్నారు. అలాంటిది ఇప్పటి తరానికి అంతగా అవగాహన లేని పెద్దాయన గురించి చెప్పడం సముద్రంలో నీళ్లు పోసి వాటినే వెనక్కు తీసే ప్రయత్నం లాంటిది. గతంలో బాల్ థాకరే కథని నవాజుద్దీన్ సిద్ధిక్ తో తీస్తే పట్టుమని వారం కూడా ఆడక డిజాస్టర్ అయ్యింది.