మహేష్ బాబు 29 – నిర్మాతలు ఎవరెవరు

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీర రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ప్యాన్ ఇండియా మూవీ ఇంకా మొదలుకాకుండానే ఇండస్ట్రీ వర్గాలు, అభిమానుల్లో విపరీతమైన చర్చకు దారి తీస్తోంది. కథ ఆల్రెడీ పూర్తయిపోయిందని ఇటీవలే విజయేంద్ర ప్రసాద్ చెప్పేయడంతో అసలైన క్రతువు ఎప్పుడు స్టార్ట్ అవుతుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా దీనికి ప్రధాన నిర్మాత శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఇచ్చిన కమిట్ మెంట్ జక్కన్న ఇప్పుడు తీర్చుకుంటున్నారు. మాట నిలబెట్టుకోవడంలో భాగమిది.

స్కేల్ చాలా పెద్దగా మారిపోవడంతో పాటు నిర్మాణ వ్యయం వెయ్యి కోట్లు దాటే సూచనలున్నాయని తేలడంతో ఇప్పుడు ప్రొడక్షన్ పార్ట్ నర్స్ గా మరికొందరు బడా ప్రొడ్యూసర్లలు చేతులు కలపబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. అందులో దిల్ రాజు పేరు వినిపిస్తోంది. అధికారికంగా చెప్పలేదు కానీ కొంత మొత్తాన్ని షేర్ రూపంలో అందజేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు చెప్పారట. ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ హక్కుల కోసమే కాకుండా థియేట్రికల్ బిజినెస్ లో అడుగు పెట్టే ఉద్దేశంతో ఎస్ఎస్ఎంబి 29లో చేరతామనే ప్రతిపాదన పెట్టిందట. ఎన్ని వందల కోట్లయినా సమకూరుస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.

ఇవన్నీ నిజమైతే మహేష్ బాబు మూవీకి ఆకాశమే హద్దుగా మారిపోతుంది. ప్రస్తుతం దీని వర్క్ కోసమే తను జర్మనీ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది కానీ తిరిగి వచ్చాకే క్లారిటీ వస్తుంది. మరోవైపు రాజమౌళి స్క్రిప్ట్ ని దిద్దే పనుల్లో బిజీగా ఉన్నారు. రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లేముందు ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. కొన్ని ముఖ్య విషయాలతో పాటు విడుదల తేదీని అనౌన్స్ చేయబోతున్నారు. ఈలోగా ఎన్ని బ్యానర్లు ఉంటాయనేది డిసైడ్ కావాలి. ఇప్పటికైతే దుర్గా ఆర్ట్స్ మాత్రమే ఉంది. ఒకప్పుడు క్షణ క్షణం, హలో బ్రదర్ లాంటి బ్లాక్ బస్టర్స్ నిర్మించిన ఈ బ్యానర్ చాలా కాలంగా ప్రొడక్షన్ కి దూరంగా ఉంటోంది.