యానిమల్ బృందానికి కొత్త టెన్షన్

ఇంకో పది రోజుల్లో ఓటిటి వెర్షన్ రిలీజయ్యాక రిపీట్ షోలు వేసుకుని ఎంజాయ్ చేయాలని చూస్తున్న మూవీ లవర్స్ కి షాక్ తప్పకపోవచ్చని ముంబై టాక్. యానిమల్ హక్కులకు సంబంధించి నిర్మాణ భాగస్వామిగా ఉన్న సినీ 1 స్టూడియోస్ ఢిల్లీ కోర్టులో కేసు వేయడం ఒక్కసారిగా వాతావరణాన్ని వేడెక్కించింది. దీని అధినేత మురద్ ఖేతాని తనకు టి సిరీస్ నుంచి బిజినెస్ కు సంబంధించిన సరైన సమాచారం రాలేదని, వాటిని అందించకుండానే నెట్ ఫ్లిక్స్ కి డిజిటల్ హక్కులు అమ్మేసి ఓటిటి ప్రీమియర్ కు రంగం సిద్ధం చేశారని ఆరోపిస్తూ పిటీషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.

యానిమల్ లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో పాటు అతని సోదరుడు ప్రణయ్ కూడా భాగస్వామి కాబట్టి వాళ్ళను కూడా ప్రతివాదులుగా చేర్చారు. థియేట్రికల్ రిలీజ్ అయిన 70 రోజుల లోపు తమకు అందించాల్సిన రెవిన్యూ స్టేట్ మెంట్ ఇప్పటిదాకా ఇవ్వలేదని, అందుకే ఓటిటి రిలీజ్ ఆపాలని అందులో పేర్కొన్నారు. టి సిరీస్ తరఫున వాదనలు కూడా బలంగా ఉన్నాయి. సినీ 1కి తాము ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నామని, ఒప్పందాలకు సంబంధించిన సమాచారం షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళే సమయానుకూలంగా స్పందించలేదని కౌంటర్లు ఇస్తున్నారు.

ఇండస్ట్రీ టాక్ మాత్రం సాధారణంగా ఇలాంటి పార్ట్ నర్ షిప్ వ్యవహారాలను ఆరు నెలల తర్వాత చూసుకుంటారని, సినీ 1 తొందరపడి కోర్టు మెట్లు ఎక్కిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి కానీ నెట్ ఫ్లిక్స్ కి ఓటిటి రిలీజ్ ఆపమని మాత్రం ఎలాంటి ఉత్తర్వులు రాలేదట. జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ జరగొచ్చనే టాక్ ఆల్రెడీ ఉంది. కోర్టులో తదుపరి హియరింగ్ జనవరి 18 అంటే రేపు జరగబోతోంది. ఒకవేళ ఎక్కువ వాయిదాలు పడితే మాత్రం ఈ నెలాఖరులో యానిమల్ ని స్మార్ట్ స్క్రీన్ల మీద చూసుకోవడం అనుమానమేనని నార్త్ మీడియా రిపోర్ట్.