బాలీవుడ్ వైపు తమన్ అడుగులు

ఇప్పుడున్న జనరేషన్లో అత్యధిక డిమాండ్ ఉన్న తెలుగు సంగీత దర్శకుల్లో తమన్ దే మొదటి స్థానం. దేవిశ్రీ ప్రసాద్ రేసులో ఉన్నాడు కానీ చేస్తున్న ప్రోజెక్టుల సంఖ్యతో పోల్చుకుంటే రెండో స్థానంలో నిలుస్తాడు. పుష్ప, సలార్ లాంటి రెండు మూడు మినహాయించి ఎక్కువ ప్యాన్ ఇండియా సినిమాలు తమన్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు అడుగులు బాలీవుడ్ వైపు వెళ్తున్నాయని ముంబై టాక్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు ఓకే అయ్యిందని తెలిసింది. తమిళంలోనూ తనేంటో నిరూపించుకున్న తమన్ నెక్స్ట్ బాలీవుడ్ ని టార్గెట్ గా పెట్టుకోవడం విశేషం.

వరుణ్ ధావన్ హీరోగా తేరి రీమేక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ హ్యాండిల్ చేసిన అట్లీ నిర్మాతగా మారి డైరెక్షన్ బాధ్యతలు కలీస్ కి అప్పజెప్పాడు. హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. వామికా గబ్బి రెండో రెండో కథానాయిక. ఇదే తెలుగులో పవన్ కళ్యాణ్ తో దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ గా తీస్తున్న విషయం విదితమే. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ని లాక్ చేసుకున్నారట. గతంలో తమన్ రెండు హిందీ సినిమాలకు కేవలం ఒక్కో పాట కంపోజ్ చేశాడు. అవి గోల్ మాల్ అగైన్, సింబా. పూర్తి స్థాయిలో పని చేయలేదు కాబట్టి కౌంట్ లోకి రావు.

ఇప్పుడీ వరుణ్ ధావన్ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సహా మొత్తం తమన్ కే ఇస్తారట. డెబ్యూ కాబట్టి ఖచ్చితంగా బెస్ట్ ఇవ్వడానికి చూస్తాడు. గుంటూరు కారం విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానులు అందులో పాటలు, బీజీఎమ్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ కూడా ఈ ఏడాది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శంకర్ కాంబోలో ఎలాంటి ఆల్బమ్ ఇచ్చి ఉంటాడోననే అంచనాలు మెగా ఫాన్స్ లో విపరీతంగా ఉన్నాయి. గత కొంత కాలంగా జోరు తగ్గిన తమన్ కొత్తగా హిందీ మార్కెట్ మీద ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.