తమన్ కాబట్టే కుర్చీమడత పాట సాధ్యమయ్యింది

గుంటూరు కారం ఆడియో మొత్తంలో హైలైట్ గా నిలిచిన పాట ఏదంటే కుర్చీ మడత పెట్టి అనే అందరూ చెబుతారు. సోషల్ మీడియాలో ఒక వృద్ధుడు వేరే సందర్భంలో అన్న వైరల్ పదాన్ని తీసుకుని దానికి ట్యూన్ కట్టి ఏకంగా ఊగిపోయే రేంజ్ లో పాటను కంపోజ్ చేయడం కష్టమే. నిజానికి సాంగ్ వచ్చిన మొదట్లో కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. దాన్ని తీసుకోకుండా ఉండాల్సిందని కొందరు సోషల్ మీడియాలో క్లాసులు తీసుకున్నారు. పాటలో విపరీతంగా తప్పు బట్టడానికి లేకపోయినా దాన్నో టాక్ అఫ్ ది టౌన్ టాపిక్ గా మార్చేశారు. ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు దీన్ని ప్రస్తావించాడు.

తాను, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి కుర్చీ మడతపెట్టిని పాటగా మారుస్తావా అని తమన్ ని అడిగినప్పుడు క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పాడని, అదే వేరే సంగీత దర్శకుడైతే పది ప్రశ్నలు వేసి ఎందుకని ఇబ్బంది పెట్టేవాడని, తమ్ముడు లాంటోడు కాబట్టి తమన్ అలా చేయకుండా అంచనాలకు మించి అవుట్ అవుట్ ఇచ్చాడని కితాబు ఇచ్చాడు. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు థియేటర్లు బద్దలైపోవడం ఖాయమని హామీ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా అభిమానుల నుంచి హర్షధ్వానాలు వినిపించాయి. తమన్ చాలా చెబుతాడనుకుంటే సక్సెస్ మీట్లో మాట్లాడతానని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు.

దీన్ని బట్టి తమన్ మీద మహేష్ బాబుకి ఎంత గురి ఉందో అర్థం చేసుకోవచ్చు. వీళిద్దరి కాంబినేషన్ లో బిజినెస్ మెన్, దూకుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఆగడు ఫ్లాప్ అయినా మ్యూజిక్ కి పేరొచ్చింది. సర్కారు వారి పాట విషయంలో మాత్రమే ఫ్యాన్స్ కొంత అసంతృప్తికి గురయ్యారు. గుంటూరు కారంలోనూ ఓ మై బేబీ గురించి పెద్ద రచ్చ జరిగింది. తర్వాత కుర్చీ మడత పెట్టి ఆ డ్యామేజ్ ని కవర్ చేసింది. ఇప్పుడు అందరి చూపు సినిమాకి తమన్ ఏ రేంజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఉంటాడో అనే దాని మీదే. ఆ అంచనాలను నిలబెట్టుకుంటే మాత్రం ఫ్యాన్స్ నెత్తిన పెట్టేసుకుంటారు