శంకర్ అంటే ఆ మాత్రం భయముంటుంది

సౌత్ జీనియస్ గా పిలుచుకునే దర్శకుడు శంకర్ తో సినిమా అంటే ఎలాంటి ఆర్టిస్టుకైనా సరే ఉత్సాహం వచ్చేస్తుంది. అందుకే ఒకప్పటిలా ఇప్పుడు ఫామ్ లో లేకపోయినా కథ నచ్చి మరీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు, నిర్మాత దిల్ రాజు వందల కోట్ల పెట్టుబడి పెట్టేస్తున్నారు. అయితే షూటింగ్ స్పాట్ లో శంకర్ వర్కింగ్ స్టైల్ చాలా టిపికల్ గా ఉంటుందని ఆయనతో పని చేసిన వాళ్లకు బాగా తెలుసు. తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్టు రాజీవ్ కనకాల పంచుకున్న అనుభవం ఆశ్చర్యపరిచేలా ఉంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవమున్న ఈ నటుడు చిత్రీకరణ టైంలో తెగ భయపడ్డారట.

మాములుగా ఎక్స్ పీరియన్స్ ఉన్న ఆర్టిస్టుకి ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసుకునే టైం ఇవ్వరు. ఆ అవసరం కూడా పడదు. కానీ గేమ్ ఛేంజర్ సెట్లో అడుగు పెట్టాక మొత్తం తమిళ బృందంతో నిండిపోయిన టీమ్ ని చూసి ఆయనలో టెన్షన్ మొదలైంది. తెలుగు వాళ్ళు ఒకరిద్దరు ఉన్నా వాళ్ళతో మాట్లాడే అవకాశం దొరికేది కాదు. దీంతో కాంబినేషన్ సీన్లు చేస్తున్న శ్రీకాంత్, చరణ్ తోనే ఎక్కువ గడపాల్సి వచ్చేది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఫలానా సీన్ ని ప్రాక్టీస్ చేసుకోమని పేపర్ ఇచ్చి వెళ్ళేవాడు. ఇదేంటి సీనియర్ ఆర్టిస్టుకి ఇన్నిసార్లు సూచనలు చెబుతున్నాడేంటని రాజీవ్ కనకాల ఒకటై ఇబ్బంది పడ్డారట.

ఇంత పర్ఫెక్షన్ కోసం తాపత్రయ పడతారు కాబట్టే శంకర్ జెంటిల్ మెన్ నుంచి 2.0 దాకా తనకు మాత్రమే సాధ్యమయ్యే ఎన్నో విజువల్ గ్రాండియర్స్ ప్రేక్షకులకు ఇచ్చారు. ఎంత ఆలస్యమవుతున్నా అభిమానుల అసహనం పీక్స్ కు చేరుకున్నా అంచనాల విషయంలో మాత్రం గేమ్ ఛేంజర్ ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. సెప్టెంబర్ లో విడుదల చేయాలని దిల్ రాజు చూస్తున్నారు కానీ శంకర్, తమన్ లు కలిసి ఫైనల్ కాపీ ఇచ్చేదాకా ఏదీ నిర్ధారణగా చెప్పలేని పరిస్థితి. అందుకే ఆడియో రిలీజ్ ని సైతం వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.