ఎర్ర సముద్రంపై ‘దేవర’ నెత్తుటి తిలకం

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా అరవింద సమేత వీర రాఘవ వచ్చి అయిదేళ్ళు దాటేసింది. ఆర్ఆర్ఆర్ కొమరం భీంగా ఎంత విశ్వరూపం చూపించినప్పటికీ అది మల్టీస్టారర్ కావడం వల్ల అభిమానుల ఎదురుచూపులన్నీ దేవర మీదే ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా దేవర రూపొందుతోంది. ప్యాన్ ఇండియా స్కేల్ లో తారక్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ టీజర్ తేదీ, సమయం ప్రకటించినప్పటి నుంచి ఫ్యాన్స్ ఉద్వేగం అంతకంతా పెరుగుతూ పోతోంది. దానికి తగ్గట్టే వరసగా ఎలివేషన్ ట్వీట్లతో హైప్ ని పెంచారు.

కథ చెప్పకుండా కేవలం దేవర ప్రపంచాన్ని ఈ టీజర్ ద్వారా పరిచయం చేశారు. హోరెత్తే అలలతో కాళరాత్రిని తలపించే సముద్రంలో ప్రయాణిస్తున్న షిప్పు మీదకు దాడి చేస్తుందో దొంగల గుంపు. అందులో కంటైనర్లను నేరుగా తస్కరించి వాటిని పడవలోకి విసిరేసి ఆపై నీళ్ళలోకి దూకేసి తప్పించుకుంటారు. అట్టగుడున పడినా ప్రాణాలతో బయట పడటం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఒడ్డున ఉండే దేవర(జూనియర్ ఎన్టీఆర్) రూపంలో ఒక నరమేథం సృష్టించే ఆయుధం తమ కోసం ఎదురు చూస్తోందని వాళ్లకు తెలియదు. రక్తాన్ని ఎక్కువ చూసిన సముద్రం గురించి దేవర ఏం చెప్పబోతున్నాడు.

విజువల్స్ సరికొత్త అనుభూతినిస్తున్నాయి. చివర్లో తారక్ నల్లని పంచెకట్టుతో బెస్తవాడిని ప్రతిబింబించే ఆహార్యంతో శత్రువులను తెగ నరుకుతున్న సీన్ అభిమానులను ఊపేసేలా ఉంది. అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంచనాలకు మించి సన్నివేశంలోని డెప్త్ ని పెంచేసింది. హీరోయిన్ జాన్వీ కపూర్, విలన్ సైఫ్ అలీఖాన్ ఇలా ఎవరిని రివీల్ చేయకుండా కేవలం జూనియర్ ని మాత్రమే చూపించారు. ఏప్రిల్ 5 విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 కోసం ఏవైతే అంచనాలు ఇప్పటికే ఉన్నాయో వాటిని మరింత పెంచేలా కొరటాల చూపించిన నెత్తురు యుద్ధం మెప్పించేసింది.