ఈగల్ వెనుకంజకు కారణాలేంటి?

సంక్రాంతి సినిమా సీజన్ ఆరంభం కావడానికి ఇంకొక వారం మాత్రమే సమయం మిగిలి ఉండగా.. రేసులో ఉన్న ఐదు సినిమాల్లో అన్నీ రిలీజ్ అవుతాయా లేదా అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఐదు చిత్రాలకు థియేటర్లు సర్దుబాటు చేయడం అసాధ్యం కావడంతో ఇందులోంచి ఒక్క సినిమా అయినా పక్కకు వెళ్లడం ఖాయం అని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరిగింది. మరి ఔట్ అయ్యే ఆ ఒక్క సినిమా ఏది అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. గురువారం సాయంత్రం సస్పెన్స్ వీడింది. రవితేజ సినిమా ఈగల్ రేసు నుంచి తప్పుకున్నట్లు అగ్ర నిర్మాత, నిర్మాతల మండలి అధ్యక్షుడు దిల్ రాజు ప్రకటించాడు.

ఈగల్ సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు రెండు మూడు రోజుల నుంచే జోరుగా చర్చ జరుగుతోంది కానీ.. నిర్మాత విశ్వ ప్రసాద్ మాత్రం సంక్రాంతికి రావడం పక్కా అని క్లారిటీ ఇవ్వడంతో అయోమయం నెలకొంది. కానీ చివరికి ఈగల్ ను పోటీ నుంచి తప్పక తప్పించినట్లు తెలుస్తోంది. సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే విషయంలో నిర్మాత ఆసక్తిగానే ఉన్న డిస్ట్రిబ్యూటర్లే వెనుకంచి వేసినట్టు తెలుస్తోంది. చాలినన్ని థియేటర్లు దక్కకపోవడం అందుకు ప్రధాన కారణమట. సినిమా మీద పెట్టిన పెట్టుబడిని.. ఇంత తీవ్రమైన పోటీ మధ్య, తక్కువ థియేటర్లలో రాబట్టుకోవడం చాలా కష్టం అన్నది డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయమట.

అందుకే ఈగల్ కోసం బుక్ చేసిన థియేటర్లకు సంబంధించి యాజమాన్యాలను వేరే ఆప్షన్ చూసుకోవాలని ముందే వాళ్ళు క్లారిటీ ఇచ్చేసారట. పోటీ వల్ల సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ కూడా క్రియేట్ కాకపోవడంతో ఈగల్ మేకర్స్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ముందు జనవరి 26న ఆల్టర్నేట్ డేట్ అనుకున్నప్పటికీ, అప్పటికి ఇంకా సంక్రాంతి సినిమాల హ్యాంగోవర్ నుంచి తెలుగు ప్రేక్షకులు బయటపడరన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 9ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వాయిదా విషయంలో హీరో రవితేజ కొంత ఇష్టంగా ఉన్నప్పటికీ అన్ని ఆలోచించుకుని చిత్ర బృందం సంక్రాంతి రేసు నుంచి తమ సినిమాను తప్పించడానికి ఓకే అన్నట్లు సమాచారం. సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ చిత్రంలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ కథానాయికలుగా నటించారు.