మీనాక్షి లేట్ పరిచయం ఎందుకంటే

గుంటూరు కారంలో పేరుకి సెకండ్ హీరోయినన్న మాటే కానీ ఇప్పటిదాకా మీనాక్షి చౌదరిని చూపించకుండా దాచి పెట్టిన త్రివిక్రమ్ బృందం ఇవాళ ఒక కొత్త పోస్టర్ తో రివీల్ చేసింది. అయితే ఇంత ఆలస్యం ఎందుకయ్యిందన్న అనుమానం తీర్చుకునేందుకు ప్రయత్నించగా యూనిట్ చెబుతున్న వర్షన్ సంతృప్తికరంగానే ఉంది. దాని ప్రకారం మీనాక్షి చౌదరికి చెప్పుకోదగ్గ సీన్లయితే పడ్డాయి కానీ మరీ ఎక్కువ ప్రాధాన్యం అనిపించే స్థాయిలో లేదట. ఉన్న నాలుగు పాటల్లో ఒకటి గ్రూప్ సాంగ్ కావడంతో మహేష్ బాబుతో సోలోగా కాలు కదిపే ఛాన్స్ రాలేదని తెలిసింది. అందుకే లో ప్రొఫైల్లో పెట్టారన్న మాట.

నిజానికి ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడు పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ కాగా ఇప్పుడు మీనాక్షి చౌదరి చేసిన మరదలి పాత్రను శ్రీలీలకి ఇచ్చారు. తర్వాత ఏవేవో కారణాల వల్ల క్యాస్టింగ్ లో మార్పులొచ్చి ధమాకా బ్యూటీకి లక్కీ ఛాన్స్ దొరికింది. అల వైకుంఠపురములో నివేత పేతురాజ్ కంటే కాస్త బెటర్ గా మీనాక్షి కనిపిస్తుంది తప్పించి ఒకవేళ బ్లాక్ బస్టర్ అయినా క్రెడిట్ లో అధిక శాతం మహేష్, శ్రీలీల జోడికి వచ్చేలా అవుట్ ఫుట్ వచ్చిందట. సరే ఫలితం సంగతి ఎలా ఉన్నా అప్ కమింగ్ హీరోలతో నెట్టుకుంటూ వచ్చిన మీనాక్షి చౌదరికి కెరీర్ పరంగా గుంటూరు కారం చాలా పెద్ద జాక్ పాట్.

ఈ శనివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. స్టేజి మీద మహేష్ గురించి ఇద్దరు భామలు ఎలాంటి ముచ్చట్లు చెబుతారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదల ఇంకో ఎనిమిది రోజులు మాత్రమే ఉండటంతో హైప్ అంతకంతా పెరుగుతోంది. బిగ్గెస్ట్ ఓపెనింగ్ కోసం నిర్మాత నాగవంశీ చేస్తున్న ప్లానింగ్ ఫ్యాన్స్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తోంది. తన మార్క్ మిస్ చేయకుండానే ఈసారి ఊర మాస్ కమర్షియల్ కథను ఎంచుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు గుంటూరు కారం బ్లాక్ బస్టర్ కావడం చాలా అవసరం. తమన్ మీద సైతం అవుట్ ఫుట్ పరంగా గట్టి ఒత్తిడే ఉంది.