ఇలాంటి ఫాలోయింగ్ బ్రహ్మానందంకే సొంతం

మాములుగా పెద్ద హీరో సినిమా రిలీజ్ లో అభిమానులు తమ కథానాయకుడిని చూసి ఈలలు వేయడం, పేపర్లు ఎగరేయడం సహజం. కానీ ఒక కమెడియన్ కి అలాంటి గౌరవం దక్కడం చాలా అరుదు. అది బ్రహ్మానందం సొంతం చేసుకున్నారు. ఇవాళ విడుదలైన   వెంకీ రీ రిలీజ్ సందర్భంగా వేసిన షోలకు రవితేజ ఎంట్రీకి, డైలాగులకు ఎంతైతే స్పందన ఉందో అంతకు మించి గజలా ట్రైన్ ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మీకి రెస్పాన్స్ కనిపిస్తోంది. అంతాక్షరి, మాస్ రాజా చేతిలో చెంపదెబ్బలు తినడం, ఆవేశంతో ఊగిపోవడం, ఏవిఐస్ తో కామెడీ ఒకటా రెండా జనాలు మాములుగా ఎంజాయ్ చేయడం లేదు.

కొన్ని చోట్ల ఏకంగా గజలా ఫ్యాన్స్ అంటూ మీమర్లు పెద్ద ఫ్లెక్సీ బ్యానర్లు వేయించడం విశేషం. దీన్ని బట్టే ఈ క్యారెక్టర్ యూత్ ని ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. సుమారు గంట దాకా ఉండే సుదీర్ఘమైన ట్రైన్ ఎపిసోడ్ లో రవితేజతో సమానమైన గుర్తింపు వెంకీలో బ్రహ్మానందం తెచ్చుకున్నారు. హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్, కూకట్ పల్లి ప్రాంతాల్లోని సింగల్ స్క్రీన్లలో ఉదయం ఏడు ఎనిమిది గంటలకు  వేసిన షోలు హౌస్ ఫుల్ కావడం ఈ సినిమాకున్న క్రేజ్ కి నిదర్శనం. ప్రతి చోటా ఇదే పరిస్థితి లేదు కానీ మెయిన్ సెంటర్స్ లో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

బ్రహ్మానందం ధన్యజీవి. నటించడం తగ్గించేసి పరిమితంగా పాత్రలు ఎంచుకుంటున్నా సరే వయసుతో సంబంధం లేకుండా పాత సినిమాల ద్వారా ఈయన కనెక్ట్ అయిపోతున్నారు. ఇటీవలే ఆయన ఆత్మకథ పుస్తక రూపంలో విడుదలైంది. ఇరవై నాలుగు గంటల్లోనే రెండు వేల కాపీలు అమ్ముడుపోవడం చూసి పబ్లిషర్లు ఆశ్చర్యపోయారు. అచ్చ తెలుగు పుస్తకం ఇంత వేగంగా ఈ టెక్నాలజీ కాలంలో సోల్డ్ అవుట్ అయ్యిందంటే అది హాస్యబ్రహ్మ ఫాలోయింగ్ కి నిదర్శనం. ఇంకో నలభై యాభై ఏళ్లయినా సరే ఈయన పూయించిన నవ్వులు తెలుగువాళ్ళ హృదయాల్లో స్థానం సంపాదించుకుంటూనే ఉంటాయి.