త్రిప్తి డిమ్రి కొత్త సినిమా ఒప్పుకుంది

యానిమల్ లో పేరుకు సెకండ్ హీరోయిన్ అయినా రష్మిక మందన్నని మించి పేరు తెచ్చుకున్న త్రిప్తి డిమ్రి మీద ఆఫర్ల వర్షం కురుస్తున్నా తను మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. సౌత్ నుంచి పెద్ద ఎత్తున కాల్స్ వెళ్లాయి కానీ తనే స్పందించలేదని ముంబై టాక్. రవితేజ మిస్టర్ బచ్చన్ లో తీసుకున్నారనే ప్రచారం జరిగింది తర్వాత అదంతా పుకారేనని అర్థమైపోయింది. ఇప్పటిదాకా వెబ్ సిరీస్, సపోర్టింగ్ రోల్స్ తో నెట్టుకుంటూ వచ్చిన త్రిప్తి డిమ్రికి సరైన అవకాశాలు తలుపు తడుతున్నాయి. అందులో భాగంగా క్రేజీ సీక్వెల్ లో నటించేందుకు సంతకం పెట్టిందని సమాచారం.

తొంబై దశకం 1990లో యూత్ ని ఊపేసిన ఆషీకీకి కొనసాగింపు 2013లో వచ్చింది. రెండూ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ గా సంగీత ప్రియుల హృదయాల్లో ప్రత్యేక చోటు సంపాదించుకున్నాయి. అప్పటి నుంచి మూడో భాగం కావాలనే డిమాండ్ వచ్చింది కానీ ఫైనల్ గా ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. అనురాగ్ బసు దర్శకత్వంలో ఆషీకీ 3ని తెరకెక్కించబోతున్నారు. యానిమల్ నిర్మించిన టి సిరీస్ భూషణ్ కుమార్ దీనికి నిర్మాత కావడం గమనించాల్సిన విషయం. ఆషీకీ ఫ్రాంచైజ్ మీద సర్వ హక్కులు కొనసాగిస్తున్న ఈ సంస్థ థర్డ్ పార్ట్ ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు.

హీరో ఎవరయ్యా అంటే కార్తిక్ ఆర్యన్ కథానాయకుడిగా కనిపించబోతున్నాడు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో ఇవ్వబోతున్నారు. 2024 ఏప్రిల్ లోగా షూటింగ్ మొదలుపెట్టి ఆపై ఏడాది ప్రథమార్థంలో విడుదల చేసేలా ప్రణాళిక వేస్తున్నారు. త్రిప్తి డిమ్రి ఇప్పుడో బ్రాండ్ గా మారడంతో ఆషికి 3కి క్రేజ్ మరింత తోడవుతుంది. మంచి ఛాన్స్ వస్తే తెలుగు తమిళ సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్న త్రిప్తి డిమ్రికి కథలు చెప్పి ఒప్పించే దర్శకులు కావాలి. ఒక టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోతో జోడి సెట్ చేసేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్.