పివిఆర్ ఐనాక్స్ షోల కథ సుఖాంతం

ప్రీమియర్లు ఇంకొద్ది గంటల్లో మొదలుకాబోతుండగా పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో అందుబాటులో ఉన్న సింగల్ స్క్రీన్లు, ఇతర బహుళ సముదాయాల్లో టికెట్లు మొత్తం అయిపోయాయి. ఫ్లడ్ లైట్లు వేసుకుని వెతికినా ముక్క దొరికే పరిస్థితి లేదు. నగరంలో అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న పివిఆర్ కాంప్లెక్సుల్లో షోలు లేకపోవడంతో ఆ ఒత్తిడి మొత్తం మిగిలిన స్క్రీన్ల మీద పడి ప్రేక్షకుల డిమాండ్ ని తట్టుకోలేని స్థితికి ఎగ్జిబిటర్లు చేరుకున్నారు. ఇంకా కొనని వాళ్ళు లక్షల్లో ఉన్నారు.

ఫైనల్ గా పివిఆర్ ఐనాక్స్ యాజమాన్యాలు సలార్ నిర్మాతలతో చేసిన చర్చలు ఫలితాన్ని ఇచ్చాయి. తెల్లవారుఝామున నాలుగు గంటల షోల నుంచి బుకింగ్స్ పెట్టేస్తున్నారు. ఈ సమస్య మొదలయ్యింది డంకీ షోల పంపకాలతో. నార్త్ లో ప్రాధాన్యం షారుఖ్ ఖాన్ సినిమాకు ఇచ్చి తమకు కనీస మద్దతు ఇవ్వడం లేదని సలార్ నిర్మాతలు నిరసనగా కంటెంట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారనే వార్త నిన్న దేశం మొత్తం మీడియాలో హోరెత్తిపోయింది. ముందు మౌనంగా ఉంటూ వచ్చిన ఐనాక్స్ మేనేజ్ మెంట్ ఫైనల్ గా సద్దుమణగడంతో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

రాబోయే రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మన నిర్మాతలు ముందే జాగ్రత్త పడటం అవసరం. ఏ భాషలో లేనన్ని ప్యాన్ ఇండియాలు టాలీవుడ్ నుంచే రాబోతున్నాయి. గేమ్ చేంజర్, పుష్ప 2, కల్కి, విశ్వంభర, మహేష్ బాబు-రాజమౌళి ఇలా మొత్తం భారతీయ మార్కెట్ ని శాసించే స్థాయిలో వేల కోట్ల పెట్టుబడులు ట్రేడ్ ని ముంచెత్తబోతున్నాయి. ఐసిసిని మన ఇండియన్ క్రికెట్ బోర్డు కంట్రోల్ చేసినట్టు బాలీవుడ్ ని దాటేసి మన గుప్పిట్లోకి అన్ని వుడ్డులు రాబోతున్నాయి. ఒకరకంగా సలార్ నిర్మాతలు అనుసరించిన ధోరణి రైటేనని చెప్పాలి.లేదంటే మళ్ళీ రిపీట్ అయ్యేది.