పెద్దవాళ్లను బయటకు లాగిన మంచు లక్ష్మి

రియా చక్రవర్తి నిజంగా సుషాంత్‍ సింగ్‍ మరణానికి కారణమయిందో లేదో సిబిఐ నిర్ధారించలేదు. అయితే సుషాంత్‍ మరణానికి రియా కారణమంటూ అతని తండ్రి కంప్లయింట్‍ పెట్టిన దగ్గర్నుంచీ ఆమెను నేరస్థురాలిగానే చిత్రీకరిస్తూ మీడియా ట్రయల్‍ జరుగుతోంది. దీని పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నా కానీ బాలీవుడ్‍ నుంచి పెద్ద గొంతుకలు వినిపించలేదు. స్వర భాస్కర్‍ లాంటి చిన్న యాక్టర్లు మాత్రం ఇదెక్కడి చోద్యమంటూ స్పందించారు. బాలీవుడ్‍ సెలబ్రిటీలు సైలెంట్‍గా వుండిపోయిన సమయంలో మంచు లక్ష్మి తన వాయిస్‍ వినిపించింది.

రియాకు జరుగుతోన్నది అన్యాయమని, ఆమె నేరస్థురాలో కాదో న్యాయ వ్యవస్థ, చట్టం తేల్చే వరకు ఎదురు చూడాలని, అంతవరకు ఆమె కుటుంబాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వాలని, ఆమెకు అండగా పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్కి సుషాంత్‍ కుటుంబ సభ్యుల నుంచి నిరసన వ్యక్తమయినా కానీ దీని వల్ల సైలెంట్‍గా వున్న బాలీవుడ్‍ బడా సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. మంచు లక్ష్మిని సమర్ధిస్తూ తాప్సీ కూడా రియాకు సపోర్ట్ గా మాట్లాడింది. విద్యాబాలన్‍ కూడా మంచు లక్ష్మి పోస్ట్ని ట్యాగ్‍ చేస్తూ తాను కూడా రియాకు జరుగుతోన్న దానిని నిరసిస్తున్నట్టు పేర్కొంది. ఇంకా సూపర్‍స్టార్లు, పెద్ద డైరెక్టర్లు బయటకు రాలేదు కానీ మొత్తానికి చలనమయితే వచ్చింది.