నాగవంశీ రెచ్చగొట్టారా నమ్మకమిచ్చారా

గుంటూరు కారం మీద గత ఇరవై నాలుగు గంటలకు పైగా జరుగుతున్న ఆన్ లైన్ వార్ గురించి నిర్మాత నాగవంశీ స్పందించడం ఇంకో హాట్ టాపిక్ కి దారిచ్చింది. యానిమల్ చివరి సీన్లో రన్బీర్ కపూర్ చూపించే ఒక పెద్దలకు మాత్రమే బాడీ లాంగ్వేజ్ సంకేతాన్ని పోస్ట్ చేసి మేమేం చేస్తున్నామో మాకు తెలుసు, జనవరి 12 కలుసుకుందాం అని ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. నిజానికి ఆయన పోస్ట్ చేసిన క్లిప్ కేవలం రెండు సెకండ్లే ఉన్నా అది అఫీషియల్ గా బి బయట దొరుకుతున్న వీడియో కాదు. ఎవరో స్నేహితులు పంపిన పైరసీ బిట్ ని వాడుకున్నారు. దీన్ని కూడా ఫ్యాన్స్ పసిగట్టేశారు.

నిజానికి నాగవంశీ అభిమానులకు అభయమిచ్చారా లేక రెచ్చగొట్టారా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే మేమేం చేస్తున్నామో మాకు తెలుసు అనడంలో ఒకరకమైన తెగింపు స్టేట్ మెంట్ ఉంది. ఓ మై బేబీ పాటకు నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని స్వీకరించి రేపు తెరమీద చూడండి అప్పుడు మాట్లాడుకుందాం అంటే వేరుగా ఉండేది. కానీ అలా చేస్తే ఆయన అందరు నిర్మాతల్లో ఒకరు అవుతారు కదా. అందుకే తన స్టయిల్ ని చూపించారు. దీన్ని కొందరు పాజిటివ్ గా తీసుకోగా మరికొందరికి వెటకారంగా అనిపిస్తోంది. సినిమా బ్రహ్మాండంగా ఉంటే ఇవన్నీ దూది పింజెల్లా ఎగిరిపోతాయి. డౌట్ లేదు.

ఎటొచ్చి అక్కడి దాకా అటు యూనిట్ ఇటు ఫ్యాన్స్ ఇద్దరూ సంయమనం పాటించాల్సిందే. అభిమానులను అదుపు చేయడం కష్టం. ఒరిజినల్ ఐడిలు కనిపించని ట్విట్టర్ ప్రపంచంలో ఎవరేం చేసినా వాళ్ళను ఆపలేరు. పైపెచ్చు ఏ మాత్రం రెచ్చగొట్టినా మంటల మీద పెట్రోల్ పోసినట్టే. నిన్న రామజోగయ్య శాస్త్రి ఇదే విధంగా కౌంటర్ ఇవ్వబోయి అనవసర ట్రోలింగ్ కి దొరికిపోయారు. దెబ్బకు ఎక్స్ నుంచి సెలవు తీసుకునేదాకా వెళ్ళింది. కొద్దినిమిషాల క్రితం నాగవంశీ మళ్ళీ ఫ్రెష్ ట్వీట్ చేస్తూ వ్యక్తిగతంగా తమ టీమ్ ని టార్గెట్ చేయడం వల్ల ఆ బాధని వ్యక్తం చేయడం కోసం అలా అన్నాను తప్పించి వేరొక కారణం లేదని చెప్పడం క్లైమాక్స్.