సూరీడు చెప్పిన సలారోడి స్నేహం కథ

భారీ అంచనాల మధ్య మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న సలార్ నుంచి ఫస్ట్ ఆడియో సింగల్ వచ్చేసింది. రెగ్యులర్ కమర్షియల్ పాటలు ఉండవని ముందే చెప్పారు కాబట్టి దానికి అనుగుణంగానే అభిమానులు ప్రిపేరయ్యారు. అనుకున్నట్టే ఎమోషనల్ సాంగ్ తో ఆల్బమ్ కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. సూరీడే గొడుగు పట్టి వచ్చాడే, భుజం తట్టి చిమ్మ చీకటిలోనూ నీడలా నిలిచేటోడు అంటూ ప్రభాస్ వ్యక్తిత్వాన్ని, స్నేహం కోసం ఎంత దూరమైనా, ఎంతకైనా తెగించే మనస్తత్వాన్ని ఇందులో ప్రతిబింబించారు. కృష్ణ కాంత్ సాహిత్యంలో హరిణి వోకల్స్ హృద్యంగా ఉన్నాయి.

సాంగ్ రివ్యూ కాసేపు పక్కనపెడితే ఈ పాట ద్వారా దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ లో ఎంత ఘాఢంగా ఫ్రెండ్ షిప్ పాయింట్ ని టచ్ చేయబోతున్నాడో అర్థమవుతోంది. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి, ఒకరిని విడిచి మరొకరు విడిచి ఉండలేనంత బంధాన్ని పెంచుకుంటారు. తల్లి లేని పృథ్విని దేవా తల్లిగా నటించిన ఈశ్వరి రావే ఆ లోటు తెలియకుండా అన్నం తినిపించే సన్నివేశంలో ఎమోషన్ ని రిజిస్టర్ చేశారు. కెజిఎఫ్ లో మదర్ సెంటిమెంట్ ని బలంగా చూపించిన ప్రశాంత్ నీల్ ఈసారి స్నేహంలోని భావోద్వేగాన్ని తీసుకున్నారు.

సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ లో ప్రభాస్, పృథ్విరాజ్ ల బంధంతో పాటు ఖన్సార్ సామ్రాజ్యంలోకి వచ్చిన శత్రువులు ఎవరు, అసలు వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు లాంటి అంశాలు కీలకం కాబోతున్నాయి. ట్రైలర్, సూరీడే పాటను బట్టి చూస్తే కత్తులు దూసుకునే దాకా దేవా, సలార్ లు ఎందుకు వెళ్లారనేది బహుశా రెండో భాగంలో ప్లాన్ చేసి ఉండొచ్చు. సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఎలాంటి వాయిద్యాల హోరు లేకుండా ట్యూన్ చేసిన విధానం బాగుంది. అయితే మాస్ లవర్స్ కి మాత్రం ఇది అంతగా ఎక్కేలా లేదు. ఇంకో వారంలోనే మిగిలిన పాటలను రిలీజ్ చేయబోతున్నారు.