ఒక్క విషయంలో సలార్ రాజీ పడాలి

కౌంట్ డౌన్ మెల్లగా తొమ్మిది రోజులకు చేరుకుంది. సలార్ విడుదల కోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భారీ ప్లానింగ్ చేసుకుంటున్నారు. హోంబాలే మేకర్స్ టికెట్ రేట్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వానికి ఆల్రెడీ విన్నపం ఇచ్చేశారు. ఆర్ఆర్ఆర్ కు ఇచ్చిన మోతాదులోనే మల్టీప్లెక్సుకు వంద, సింగల్ స్క్రీన్ కు యాభై పెంచేలా లెటర్ పెట్టారు. దీనికి జిఎస్టి అదనంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోనూ అడిగారు కానీ మరీ భారీ స్థాయిలో ఎస్ అనకపోవచ్చు. ముందు నుంచి ఫాలో అవుతున్న పద్ధతి వల్ల మహా అయితే పాతిక నుంచి యాభై రూపాయల మధ్యలోనే గ్రీన్ సిగ్నల్ రావొచ్చని వినికిడి.

ఇదిలా ఉండగా సలార్ ఎంత గ్రాండ్ గా దిగుతున్నా ఒక్క విషయంలో రాజీ పడటం తప్పదు. ఒక రోజు ముందే డంకీ, ఆక్వామెన్ ఫాలెన్ కింగ్ డంలు వస్తుండటంతో స్క్రీన్ల సర్దుబాటు పెద్ద సమస్యగా మారిపోయింది. సాహో, రాధే శ్యామ్ లకు మొదటి రోజు హైదరాబాద్ లో ఏకంగా 1000కి పైగా షోలు సాధ్యమయ్యాయి. కానీ ఇప్పుడు వాటిలో 40 శాతం దాకా షారుఖ్ ఖాన్, హాలీవుడ్ మూవీ తీసేసుకుంటాయి కాబట్టి ఆ మేరకు కాంప్రోమైజ్ కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో మూడింటికి డిమాండ్ ఉంటుందనేది వాస్తవం. అలాంటిది ప్రత్యేకంగా ఒకరికే ప్రాధాన్యం సాధ్యం కాదు.

సానుకూలంగా కనిపించే విషయం ఏంటంటే డంకీ, అక్వమెన్ లో దేనికైనా డిజాస్టర్ టాక్ వస్తే అప్పుడు రెండు లేదా మూడో రోజు నుంచే వాటికి సంబంధించిన కొన్ని షోలు సలార్ కు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా బిసి సెంటర్లలో. అయితే ఇక్కడ ప్రభాస్ కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటేనే సాధ్యమవుతుంది. గతంలో స్పైడర్ మ్యాన్ తాకిడిని తట్టుకుని పుష్ప 1 విజయం సాధించడం ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. షారుఖ్ జీరోని పక్కకు తోసేసిన కెజిఎఫ్ 1ని ఉదాహరణగా చూపిస్తున్నారు. చూడాలి మరి దేవా అలియాస్ సలార్ ఏం చేస్తాడో.