పవన్ అభిమానుల్లో ‘ఎక్స్‌ట్రా’ అనుమానం

నిన్న విడుదలైన ఎక్స్ ట్రాడినరి మ్యాన్ ని దర్శకుడు వక్కంతం వంశీ హ్యాండిల్ చేసిన విధానం చూశాక పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త అనుమానం మొదలయ్యింది. ఎందుకంటే సురేందర్ రెడ్డి పవర్ స్టార్ కలయికలో రాబోయే సోషల్ డ్రామాకు స్టోరీ ఇచ్చింది ఆయనే. డైరెక్షన్ కాదు కదా అలాంటప్పుడు టెన్షన్ ఎందుకనే డౌట్ వస్తుందా. అక్కడికీ వద్దాం. అఖిల్ కెరీర్ లోనే మర్చిపోలేని డిజాస్టర్ గా నిలిచిన ఏజెంట్ కి కథను ఇచ్చింది వక్కంతమే. తీసింది సూరినే. ఈ ఇద్దరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం చేతులు కలిపారు. అలాంటప్పుడు ఫ్యాన్స్ లో లేని భయాలు పుట్టుకురావడం సహజం.

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వక్కంతం వంశీ దర్శకుడిగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా విషయంలో తీవ్ర విమర్శలు అందుకోలేదు. ఫలితం తేడా కొట్టినా ఒక ఫిలిం మేకర్ గా ప్రశంసలు వచ్చాయి. కానీ ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లో ఎక్కడా ఆ ఛాన్స్ ఇవ్వలేదు. పైగా రేస్ గుర్రంని రీమిక్స్ చేసి తీసినట్టు హీరోని ఫేక్ పోలీస్ ఆఫీసర్ ని చేసి దాని ద్వారా కామెడీ రాబట్టాలని చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టింది. మొదటి రోజు కనీసం అయిదు కోట్ల గ్రాస్ దాటలేకపోవడం నిజంగానే షాక్. నితిన్ చాలా నమ్మకంతో ప్రమోషన్ కోసం అమెరికా వెళ్ళాక వచ్చిన ఫిగర్లివి.

ఏజెంట్ ఫలితం వల్ల సురేందర్ రెడ్డి ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకపోవచ్చు కానీ వక్కంతం పెన్నులో ఇంకు అయిపోతోందన్న సంకేతం వచ్చిన నేపథ్యంలో స్టోరి ఎక్స్ ట్రాడినరిగా ఉండాల్సిందే. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో ప్రత్యేకంగా నొక్కి చెప్పాడు. రచయితలందరూ పెద్ద దర్శకులు కాలేరు. జంధ్యాల, కొరటాల, త్రివిక్రమ్ లాంటి కొందరు మినహాయింపుగా నిలిచారు కానీ వాళ్ళ సరసన నిలవాలనుకున్న వక్కంతంకి ఇంకో స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వడం అంత సులభం కాదు. మైండ్ బ్లోయింగ్ అనే కథ చెబితే తప్ప మళ్ళీ మెగా ఫోన్ చేపట్టే ఛాన్స్ దొరకదు. చూద్దాం.