ఇద్దరి మౌనం వెనుక కారణముందేమో

హైదరాబాద్ లో జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు, రాజమౌళిలు గెస్టులుగా రావడం ఎంత ప్లస్ అయ్యిందో తెలిసిన విషయమే. ట్రైలర్ చూసి మెంటల్ వచ్చిందని మహేష్, వర్మ లాంటి అరుదైన దర్శకుల జాబితాలో సందీప్ రెడ్డి వంగాకు చోటివ్వాలని జక్కన్న ఇలా ఇద్దరూ కలిసి ఓ రేంజ్ లో పొగిడారు. కట్ చేస్తే సినిమా విడుదలై ఇవాళ్టికి నాలుగో రోజు. సోషల్ మీడియాలో వీళ్ళ స్పందన కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఎలాంటి ట్వీట్లు, స్టోరీలు కనిపించడం లేదు. మహేష్ అంటే గుంటూరు కారం షూటింగ్ లో బిజీ ఉండి ఇంకా కుదరలేదనుకోవచ్చు

కానీ రాజమౌళికి తగినంత సమయం ఉంది. తన మద్దతు అవసరమైన చిన్న చిత్రాలకే ప్రసాద్ ఐమాక్స్ వెళ్లి చూసినప్పుడు యానిమల్ కోసం ఓ మూడున్నర గంటలు కేటాయించడం పెద్ద మ్యాటర్ కాదు. అసలింతకీ చూశారో లేదోననే అనుమానం తీరాల్సి ఉంది. ఒకవేళ చూశాక ఇంత అడల్ట్ కంటెంట్, సన్నివేశాలు ఉంటాయని ఊహించలేదు కాబట్టి ఇప్పుడేమైనా ప్రశంసలు గుప్పిస్తే ఏమైనా విమర్శలు వస్తాయని అనుమానంగా ఉందో ఏమిటో. అయినా వారం తిరక్కుండానే వందల కోట్లు దాటేసిన మూవీకి ఆడియన్స్ మద్దతు దొరికినప్పుడు ఇక ఆలోచించడానికి ఏముంది.

గతంలో పలు సందర్భాల్లో మహేష్ ఆలస్యంగా సినిమా చూడటం వల్ల లేట్ గా స్పందించిన ఉదంతాలున్నాయి. మహేష్, రాజమౌళి ఇద్దరూ కోరుకోవాలే కానీ ఇంట్లోనే క్యూబ్ ద్వారా లేదా డిజిటల్ కీ ద్వారా నిమిషాల్లో షో ఏర్పాటు చేసుకునే వెసులుబాటు యానిమల్ నిర్మాతలు ఇస్తారు. కానీ వాడుకోవడం లేదంటే బహుశా ఆగమనే మెసేజ్ వచ్చిందేమో. సూపర్ స్టారని మహేష్ తోనే అనిపించుకున్న రన్బీర్ కపూర్ మళ్లోసారి హైదరాబాద్ వచ్చి సక్సెస్ మీట్ లో పాల్గొనే ఆలోచనలో ఉన్నాడు. అన్నట్టు సందీప్ వంగా నానిమల్ ఇంటర్వ్యూ చేసుకున్న నాని కూడా ఇంకా యానిమల్ చూసినట్టు లేడు.