టైగర్ కొట్టిన దెబ్బ సరిపోలేదా భాయ్

దీపావళి పండగ సందర్భంగా విడుదలైన టైగర్ 3 మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని పఠాన్, జవాన్ లను దాటేస్తుందని ఆశలు పెట్టుకుంటే అవి కాస్తా నీరుగారి పోయాయి. వాటి దగ్గరకు కూడా వెళ్లే అవకాశం లేదని వసూళ్లు తేల్చి చెప్పేశాయి. యావరేజ్ టాక్ రావడం మొదటి దెబ్బ కొట్టగా, ఇండియా ఆడిన సెమి ఫైనల్, ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచులు పరిస్థితిని ఇంకా దిగజార్చాయి. మూడు వందల కోట్లు దాటేసిందని నిర్మాతలు చెబుతున్నారు కానీ టార్గెట్ పెట్టుకున్న ఆరు వందల కోట్లను అందుకోవడం మాత్రం అసాధ్యం. ఇంకో రెండు వారాలు చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడం ఒక్కటే ఊరట.

కానీ సల్మాన్ ఖాన్ మాత్రం టైగర్ 3 భారీ బ్లాక్ బస్టరనే నమ్ముతున్నాడు. దీని ప్రమోషన్లలో భాగంగా స్టార్ స్పోర్ట్స్ స్టూడియోకు విచ్చేసిన కండల వీరుడు టైగర్ 4 స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని చెప్పేశాడు. సీక్వెల్ ప్లానింగ్ అయిపోయిందని హింట్ ఇచ్చాడు. అయితే దర్శకుడు మనీష్ శర్మనా లేక వేరొకరా అనేది మాత్రం తేల్చి చెప్పలేదు. కలెక్షన్లు మందకొడిగా ఉన్న సంగతి గుర్తించే నిన్న ముంబైలో యష్ ఫిలిమ్స్ బృందంతో కలిసి హడావిడిగా సక్సెస్ మీట్ పెట్టి అభిమానులను, మీడియాను సల్మాన్ కలుసుకున్నాడు. స్టేజి మీద స్టెప్పులు వేసి ఆనందాన్ని పంచుకున్నాడు.

స్పై యూనివర్స్ పేరుతో పాకిస్థాన్ చుట్టూ తిప్పే కథలకు స్వస్తి చెప్పమంటున్నారు అభిమానులు. పైగా టైగర్ 3లో శత్రుదేశం మీద అవసరానికి మించి సానుభూతి కురిపించడం మెజారిటీ ఆడియన్స్ కి నచ్చలేదు. మిలిటరీ పాలన తప్ప అక్కడంతా మంచోళ్ళే ఉన్నారన్న రేంజ్ లో కథ రాశాడు నిర్మాత ఆదిత్య చోప్రా. దేశాలు మారితేనే గూఢచారి బ్యాక్ డ్రాప్ లో కొత్తదనం ఉంటుంది. అంతే తప్ప అరిగిపోయిన రికార్డు లాగా పదే పదే విలన్ ని పాకిస్థాన్ నుంచి పట్టుకొస్తే వెగటు పుడుతుంది. క్రికెట్ లో పాక్ ని ఎన్నిసార్లు ఓడించినా కిక్ వస్తుంది కానీ స్క్రీన్ మీద రుద్దితే మాత్రం విసుగు వచ్చేస్తుంది.