మిస్టరీ థ్రిల్లర్.. మళ్లీ సక్సెస్

సినీ పరిశ్రమలో ఒక జానర్లో సినిమా మంచి విజయం సాధించిందంటే.. ఇక ఆ కోవలో వరుసగా సినిమాలు రెడీ అవుతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో బాగా క్లిక్ అవుతున్న జానర్ అంటే మిస్టరీ థ్రిల్లరే. హార్రర్ కథలనే కొంచెం భిన్నంగా ప్రెజెంట్ చేస్తూ.. ప్రేక్షకులను ట్విస్టులతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ థ్రిల్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఫిలిం మేకర్లకు మంచి ఫలితం దక్కుతోంది. నిజానికి ఈ జానర్ ఊపందుకోవడానికి కారణం.. తెలుగు సినిమా కాదు. 

గత ఏడాది కన్నడ నుంచి వచ్చిన ‘కాంతార’ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దీన్నుంచి స్ఫూర్తి పొందిన మన ఫిలిం మేకర్స్ కూడా హార్రర్ కథలను ‘కాంతార’ స్టయిల్లో డీల్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో వచ్చిన ‘విరూపాక్ష’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే ఈ చిత్రం అతి పెద్ద హిట్‌గా నిలిచింది.

దాదాపు యాభై కోట్ల వసూళ్లతో ‘విరూపాక్ష’ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దాని సీక్వెల్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ జానర్‌కు మరింత ఊపునిస్తూ ఇటీవలే ‘మా ఊరి పొలిమేర-2’ అనే చిన్న చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నందుకుంది. ఆ సినిమా స్థాయికి మించి వసూళ్లు రాబట్టింది. ఓటీటీలో రిలీజైన ‘మా ఊరి పొలిమేర’కు కొనసాగింపుగా అనిల్ విశ్వనాథ్ రూపొందించిన ఈ చిత్రానికి అంత గొప్ప టాకేమీ రాకపోయినా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ అయింది.

దానికి ఇంకో సీక్వెల్ కూడా రాబోతోంది. కాగా లేటెస్ట్‌గా ‘మంగళవారం’ సైతం ఇదే జానర్లో తెరకెక్కి ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఆద్యంతం బిగితో నడిపించిన అజయ్ భూపతి ప్రేక్షకులను బాగానే ఇంప్రెస్ చేశాడు. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం మంచి టాక్, ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్‌లకు ఇంకో సక్సెస్ దక్కినట్లే. వరుసగా ఈ జానర్ సినిమాలు సక్సెస్ అవుతుండటం సందీప్ కిషన్ సినిమా ‘ఊరి పేరు భైరవకోన’కు కూడా పెద్ద ప్లస్ అయ్యేలాగే ఉంది.