సలార్ పోటీ కోసం డుంకీ రిలీజ్ ట్విస్టు

డిసెంబర్ 22 ప్రభాస్ సలార్ విడుదల కోసం తెలుగు ఆడియన్స్ కాదు మొత్తం ఇండియా వైడ్ మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజుని గతంలోనే లాక్ చేసుకున్న షారుఖ్ ఖాన్ డుంకీతో పోటీకి రంగం సిద్ధమవ్వడంతో బయ్యర్లు థియేటర్ల సర్దుబాటు గురించి ఆలోచిస్తూ ఇప్పటి నుంచే టెన్షన్ పడటం మొదలుపెట్టారు. ఒకదశలో డుంకీ పోస్ట్ పోన్ అవుతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే రెడ్ చిల్లీస్ టీమ్ చాలా తెలివైన ఎత్తుగడతో సలార్ కంటే ఒకరోజు ముందు రావాలని నిర్ణయించుకుని డిసెంబర్ 21 రిలీజ్ డేట్ ప్రకటించింది.

ఇది పక్కా వ్యూహమని చెప్పాలి. ఎందుకంటే ఒకరోజు ముందు రావడం చాలా లాభాలుంటాయి. మొదటిది అత్యధిక నెంబర్లతో స్క్రీన్లు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే మరుసటి రోజు సలార్ ఫస్ట్ షో పడే లోపే షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వైరలవుతుంది. ఇక్కడే రిస్క్ కూడా ఉంది. ఏ మాత్రం సినిమా అటు ఇటుగా ఉందనే మాట వినిపించినా ఆటోమేటిక్ గా ప్రేక్షకుల దృష్టి సలార్ మీదకు వెళ్తుంది. అయితే డుంకీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కావడంతో కంటెంట్ మీద ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఖచ్చితంగా క్లాసికని ముందే ఫిక్స్ అవుతున్నారు.

ఈ అనూహ్య పరిణామం ట్రేడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తన స్టేక్ హోల్డర్స్ తో పలు దఫాల సంప్రదింపులు జరిపిన తర్వాతే షారుఖ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముంబై టాక్. సో ఒకే రోజు నువ్వా నేనాని తలపడాల్సిన షారుఖ్ ప్రభాస్ మధ్య ఇరవై నాలుగు గంటల గ్యాప్ వచ్చేసింది. తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న డుంకీ వలసదారుల కాన్సెప్ట్ మీద రూపొందుతోందట. అయితే ఇందులో పఠాన్, జవాన్ లాగా ఓవర్ బోర్డు హీరోయిజం ఉండదు. హిరానీ మార్క్ కామెడీ ప్లస్ ఎమోషన్స్ ని చూడొచ్చు. మరి సలార్ లాంటి మాస్ డైనోసర్ ని ఎలా ఎదురుకుంటుందనేది ఆసక్తికరమే.