విడిపోతున్నాం.. శిల్పా శెట్టి భర్త పోస్ట్

ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తిని పెళ్లాడి చాలా ఏళ్ల కిందట వార్తల్లో వ్యక్తిగా మారింది శిల్పా శెట్టి. ఆమె వరించిన వ్యక్తి పేరు.. రాజ్ కుంద్రా. అతను వ్యాపారవేత్త. కెరీర్ అయిపోయిందనుకున్న దశలో ‘బిగ్ బ్రదర్’ షోలో పాల్గొని అనూహ్యమైన పాపులారిటీ సంపాదించిన శిల్పా.. ఆ తర్వాత రాజ్ కుంద్రాను పెళ్లాడటం.. వీళ్లిద్దరూ కలిసి ఐపీఎల్‌ టీం రాజస్థాన్ రాయల్స్‌లో వాటాదారులుగా మారడం.. తర్వాతి కాలంలో వందల కోట్లు ఆర్జించడం తెలిసిందే.

ఐతే కొన్నేళ్లు వీరి వైవాహిక జీవితం సవ్యంగానే సాగింది. శిల్పా రాజ్‌తో ఒక బిడ్డను కూడా కంది. కానీ రాజ్ కుంద్రా ఐపీఎల్‌లో బెట్టింగ్ వ్యవహారాల్లో భాగమై అన్‌పాపులర్ అవడమే కాక వేరే కేసుల్లో కూడా చిక్కుకోవడంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఒక దశలో ఇద్దరూ విడిపోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఏమైందో ఏమో తెలియదు. వీరి బంధం గురించి క్లారిటీ లేకపోయింది.

ఐతే రాజ్ కుంద్రా ఇప్పుడు సోషల్ మీడియాలో ‘‘మేం విడిపోతున్నాం. కష్ట కాలంలో మాకు అండగా నిలవండి, అంతా మంచే జరగాలని కోరుకోండి’’ అంటూ ఒక పోస్ట్ పెట్టి సంచలనం రేపాడు. ఈ పోస్ట్‌.. శిల్పా నుంచి అధికారికంగా విడాకులు తీసుకోవడం గురించే అయ్యుంటుందని భావిస్తున్నారు. కానీ శిల్పా నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇద్దరూ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో విడిపోతున్నట్లయితే ఉమ్మడిగా ప్రకటన చేయొచ్చు.

లేదంటే విడి విడిగా ఒకేసారి విడాకుల గురించి అనౌన్స్ చేయొచ్చు. కానీ రాజ్ మాత్రమే ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడన్నది అర్థం కావడం లేదు. ఐతే రాజ్ ఇటీవలే ‘యూటీ 69’ పేరుతో ఒక సినిమా చేశాడు. అది అతడి జీవిత కథ ఆధారంగానే తెరకెక్కింది. తనే లీడ్ రోల్ చేశాడు. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఏదైనా గిమ్మిక్ చేస్తున్నాడా.. అందుకోసమే ఈ పోస్ట్ పెట్టాడా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.