‘లియో’ను ప్రదర్శించమని బోర్డు పెట్టేశారు

భారీ హైప్ మధ్య రిలీజవుతున్న ‘లియో’ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్సే వస్తోంది కానీ.. ఈ సినిమాకు కొన్ని అవాంతరాలు మాత్రం తప్పట్లేదు. ముఖ్యంగా తమిళనాడులో విజయ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తూ తెల్లవారుజామున షోలు క్యాన్సిల్ చేశారు. కనీసం ఉదయం 7 గంటల నుంచి అయినా షోలు మొదలవుతాయని ఆశిస్తే అదీ జరగలేదు. 9 గంటలకు కానీ తొలి షో పడట్లేదు.

తమిళనాడు మినహా చాలా చోట్ల ఒక షో పూర్తయ్యే సమయానికి తమ దగ్గర సినిమా మొదలవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇదిలా ఉండగా.. తమిళనాట కొన్ని థియేటర్ల యాజమాన్యాలు ‘లియో’ సినిమాను ప్రదర్శించబోమని బోర్డులు పెట్టేయడం చర్చనీయాంశం అవుతోంది. అందుక్కారణం.. ‘లియో’కు థియేటర్ల నుంచి వచ్చే రెవెన్యూలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ వాటా అడుగుతుండటమే కారణం.

టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో 80-85 శాతం మధ్య తమకు ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారట. ఐతే 70 శాతానికి మించి ఇవ్వమని థియేటర్ల యాజమాన్యాలు అంటున్నట్లు తెలుస్తోంది. వేర్వేరు చోట్ల వేర్వేరు రకాల డీల్స్ జరగ్గా.. కొన్ని థియేటర్లు మాత్రం డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్న ఆదాయం ఇవ్వలేమని, అది తమకు ఎంతమాత్రం గిట్టుబాటు కాదని తేల్చేశారు.

తమ థియేటర్లలో ‘లియో’ సినిమాను ప్రదర్శించబోమంటూ బోర్డులు కూడా పెట్టేశారు. చెన్నైలోని ఫేమస్ థియేటర్ ‘రోహిణి’ సహా పలు థియేటర్లు ఈ బాటలో నడిచాయి. ఇదిలా ఉంటే.. ‘లియో’ సినిమాను నెల రోజులకే ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో.. నార్త్ ఇండియా అంతటా పీవీఆర్ సహా కొన్ని మల్టీప్లెక్సులు ఈ సినిమాను ప్రదర్శించడం లేదు. థియేట్రికల్ రిలీజ్‌కు, ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు లేని సినిమాలను తమ స్క్రీన్లలో ప్రదర్శించకుండా మల్టీప్లెక్స్ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.