టైగర్ పంజాని తక్కువంచనా వేస్తున్నారా

పెద్దలు చెప్పినట్టు పులి నాలుగడుగులు వెనక్కు నడిచిందంటే అది ముందుకు దూకడానికేనని టైటిల్ లో టైగర్ కు తగట్టే నాగేశ్వరరావు లో ప్రొఫైల్ మైంటైన్ చేయడం అభిమానులకు రుచించడం లేదు. లియో బుకింగ్స్ చాలా దూకుడు మీదున్నాయి. భగవంత్ కేసరి ఊపందుకుంటున్నాడు. వీటితో పోలిస్తే బజ్ పరంగా కొంత వెనుకబడి ఉంది మాస్ మహారాజానే. ప్యాన్ ఇండియా స్థాయిలో ఇంత పెద్ద బడ్జెట్ తో తీసి హైప్ విషయంలో డామినేట్ చేయాల్సింది పోయి తక్కువ సౌండ్ చేయడం వెనుక ఆంతర్యం అంతు చిక్కడం లేదు. హీరోతో సహా టీమ్ మొత్తం ప్రమోషన్లలోనే ఉంది.

నిజానికి నాగేశ్వరరావు అనే దొంగ జీవితంలో ఒళ్ళు గగుర్పొడిచే సంఘటనలు, స్టువర్ట్ పురం ఊరి వెనుక ఉన్న ఘాడమైన చరిత్ర, పుస్తకాల్లో లేని ఎన్నో షాక్ ఇచ్చే ఉదంతాలు చాలానే ఉన్నాయి. వాటిని చాలా మటుకు కవర్ చేశామని దర్శకుడు వంశీ చెబుతూ వస్తున్నారు. అయితే ట్రైలర్ లో వీలైనంత వరకు చూపించే ప్రయత్నం చేశారు కానీ ఆడియన్స్ ని ఖచ్చితంగా మొదటి రోజే చూడాలన్నా బలీయమైన కాంక్షను రగిలించలేకపోయారు. ఈ అడ్వాంటేజ్ ని భగవంత్ కేసరి, లియోలు వాడుకుని అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా గట్టి ఆధిపత్యం చూపిస్తున్నాయి.

ఇంకో మూడు రోజులే ఉంది కాబట్టి పబ్లిక్ తీర్పు కోసం టైగర్ నాగేశ్వరరావు బృందం ఎదురు చూస్తోంది. ఒక రోజు ఆలస్యంగా రావడం వల్ల కొన్ని ప్లస్సులు మైనస్సులు తోడవుతున్నాయి. బాలయ్య, విజయ్ లలో ఎవరికి పాజిటివ్ టాక్ వచ్చినా దాని ప్రభావం సహజంగానే రెండో రోజు కూడా కొనసాగుతుంది. టైగర్ బాగుందనే మాట వినిపించినా మూడింట్లో ఏవి చూడాలన్న సామాన్య ప్రేక్షకుడి కన్ఫ్యూజన్ ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. రవితేజ అభిమానులు మాత్రం ఇది తుఫాను ముందు ప్రశాంతతేనని ఒక్క షో అయ్యాక లెక్కలు అమాంతం మారిపోతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం.