ఓటీటీలో రిలీజ్ వద్దంటూ ఉద్యమం

Jagame Thanthram

ఇది ఓటీటీ కాలం. వివిధ సినీ పరిశ్రమల్లో పేరున్న సినిమాలు థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి నేరుగా ఓటీటీల్లో రిలీజ్ అయిపోతున్నాయి. హిందీలో గులాబో సితాబో, దిల్ బేచారా, శకుంతలా దేవి, రాత్ అఖేలి హై, గుంజన్ సక్సేనా లాంటి పెద్ద సినిమాలు ఇలాగే రిలీజయ్యాయి.

ఇంకా సడక్-2, లక్ష్మీబాంబ్, బుజ్-ది ప్రైడ్ లాంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. తెలుగులో ఇప్పటిదాకా చిన్న సినిమాలే వచ్చాయి కానీ.. సెప్టెంబరు 5న ‘వి’ లాంటి క్రేజీ మూవీ అమేజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతోంది. తమిళంలో సూర్య చిత్రం ‘సూరారై పొట్రు’ (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) కూడా అక్టోబరు చివర్లో ప్రైమ్‌లోకి రాబోతోంది. సూర్య లాంటి పెద్ద హీరోనే మెట్టు దిగాక మిగతా హీరోలు కూడా ఓటీటీ రిలీజ్‌కు సై అనేస్తారని.. విడుదలకు సిద్ధంగా ఉణ్న మీడియం, పెద్ద రేంజి సినిమాలు వరుసగా ఓటీటీల్లోకి వచ్చేస్తాయని వార్తలొస్తున్నాయి.

ఈ కోవలోనే ధనుష్ కొత్త చిత్రం ‘జగమే తంత్రం’ కూడా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయినట్లు మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ ధనుష్ అభిమానులకు ఈ వార్త అస్సలు నచ్చలేదు. నిన్న రాత్రి నుంచి వాళ్లు సోషల్ మీడియాలో ఉద్యమానికి దిగారు. ‘వుయ్ వాంట్ జగమే తంత్రం ఇన్ థియేటర్స్ ఓన్లీ’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. దీని మీద లక్షల ట్వీట్లు పడ్డాయి. ధనుష్ కెరీర్లో అత్యధిక బడ్జెట్లో భారీతనంతో తెరకెక్కిన ఈ సినిమాను తాము టీవీల్లో చూడాలనుకోవట్లేదని, బిగ్ స్క్రీన్ మీదే చూస్తామని వాళ్లంటున్నారు.

దీనిపై చిత్ర బృందం నుంచి ఓ ప్రకటన రావాలని కూడా డిమాండ్ చేశారు. ఐతే నిర్మాతలకు ఆ ఉద్దేశమే లేదా.. లేదంటే అభిమానుల ఆందోళన చూసి వెనక్కి తగ్గారా అన్నది తెలియలేదు కానీ.. ఈ సినిమాను నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చూచాయిగా చెప్పారు. ధనుష్ సైతం చిత్ర బృందానికి చెందిన ఒకరు ఈ సినిమా థియేటర్లలోనే రిలీజవుతుందనే సంకేతాలిస్తూ వేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసి అభిమానులను శాంతింపజేసే ప్రయత్నం చేశాడు.