వ‌ర్మపై సినిమా.. ఈసారి సెటైర్ కాదు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా కొంద‌రు సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి దూరిపోయి కొన్ని సినిమాలు తీశాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఇది న‌చ్చ‌ని వాళ్లు ఆయ‌న మీద సినిమాలు తీయ‌డం మొద‌లుపెట్టారు. సీనియ‌ర్ లిరిసిస్ట్ జొన్న‌విత్తుల రామలింగేశ్వ‌ర‌రావుతో పాటు బిగ్ బాస్ ఫేమ్ నూత‌న్ నాయుడు వ‌ర్మ మీద సినిమాలు తీసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ‌రుస‌లో ఇంకో సినిమా కూడా త‌యారైంది. ఐతే ఈ చిత్రాలు వ‌ర్మ తీసిన సినిమాల కంటే నాసిర‌కంగా, సిల్లీగా అనిపించి ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించ‌లేదు. ఐతే ఇప్పుడు వ‌ర్మ మీద మ‌రో సినిమా రాబోతోంది. అది పై సినిమాల కోవ‌లో సెటైర్ కాదు. షార్ట్ ఫిలిం టైపూ కాదు. వ‌ర్మ మీద సీరియ‌స్‌గా ఓ భారీ సినిమాను ప్లాన్ చేసింది ఈ చిత్ర బృందం. రాము పేరుతో ఈ సినిమా తెరకెక్క‌నుంది.

కాలేజీ కుర్రాడిగా వ‌ర్మ జీవితంతో మొద‌లుపెట్టి.. ఆ త‌ర్వాత సినీ ద‌ర్శ‌కుడిగా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం.. ఇప్పుడు త‌న స్థాయికి ఏమాత్రం త‌గ‌ని సినిమాలు తీసే స్థాయికి చేర‌డం, వివాదాస్ప‌దుడిగా మార‌డం వ‌ర‌కు వ‌ర్మ మొత్తం జీవితాన్ని ఈ సినిమాలో చూపించ‌నున్నారు. ఇది మూడు భాగాలుగా తెర‌కెక్క‌నుంది. ఒక్కోటి రెండు గంట‌ల నిడివి ఉంటుంద‌ట‌. బొమ్మాకు క్రియేషన్స్ అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దొర‌సాయి తేజ అనే కొత్త దర్శ‌కుడు దీన్ని రూపొందిస్తున్నాడు. పార్ట్ 1 సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆగస్ట్ 26 న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు.

మొదటి భాగం లో 20 ఏళ్ల ఆర్జీవీ పాత్రలో ఒక యువ నటుడు నటించబోతున్నాడట‌, ఈ భాగం లో విజయవాడలో వ‌ర్మ‌ కాలేజ్ రోజులు, ఆయన ప్రేమలు, ఆర్జీవీ పాల్గొన్న గ్యాంగ్ ఫైట్స్, శివ సినిమా కోసం ఏం చేశాడు, రిలేషన్ షిప్స్ ను ఎలా వాడుకున్నాడు అనే అంశాలు చూపించనున్నారు. రెండవ పార్ట్ లో వేరే నటుడు నటిస్తాడ‌ట‌. వర్మ అండర్ వరల్డ్ తో ప్రేమాయణం, ముంబై జీవితం లో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్, అమితాబ్ తో ఉన్న అనుబంధాలను తెరకెక్కించనున్నారు. పార్ట్ 3లో ఆర్జీవీ నే స్వయంగా నటించబోతుండ‌బోతుండ‌టం విశేషం. ఆర్జీవీ ఫెయిల్యూర్స్, వివాదాలు, దేవుళ్ళ పై, సెక్స్ పై, సమాజం పై ఉన్న అభిప్రాయాలతో పాటుగా, చాలామంది పై ఉన్న ఆర్జీవీ ప్రభావం గురించి చూపించనున్నారట‌.